అంచనాలకు మించి రాణించిన ఆప్ఘన్ స్పిన్నర్లు
అంతర్జాతీయ క్రికెట్లో ఆప్ఘనిస్థాన్ జట్టు పసికూన అయినప్పటికీ, ఆ జట్టు అద్భుతమైన స్పిన్నర్లను కలిగి ఉంది. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్థాన్కు చెందిన బౌలరే కావడం విశేషం. ఇక, మహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ జట్టుకు అదనపు బలం. ఈ ముగ్గరూ కలిసి శ్రీలంకపై 6 వికెట్లు పడగొట్టారు. శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ను ఆరంభంలోనే డకౌట్ చేసి ముజీబ్ చక్కటి ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ తన ఎటాక్ బౌలింగ్తో రంగంలోకి దిగడంతో శ్రీలంక పూర్తిగా ఆప్ఘన్ బౌలర్లకు వశమైంది.
చెత్త బ్యాటింగ్ లైనప్ కలిగిన శ్రీలంక
ఈ టోర్నీలో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ చాలా చెత్తగా ఉంది. గత కొంతకాలంగా శ్రీలంక టాపార్డర్ బ్యాట్స్మెన్ గాయాలు పాలవడంతో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో కుశాల్ మెండిస్ (0) ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తరంగ (36), ధనంజయ డిసిల్వా (23) ఫరవాలేదనిపించారు. అయితే, వాళ్లు ఎక్కువ ఓవర్లే ఆడినా వేగంగా పరుగులు సాధించలేకపోయారు. పరుగు తీసే ప్రయత్నంలో డిసిల్వా రనౌట్ కాగా.. రషీద్ఖాన్ వేసిన మ్యాజిక్ బంతికి కుశాల్ పెరీరా (17) బౌల్డ్ అయ్యాడు. తరంగను నయిబ్ ఔట్ చేయగా.. సెహన్ జయసూర్య (14) రనౌట్ కావడంతో లంక 108/5తో కష్టాల్లో పడింది. మాథ్యూస్ (22), పెరీరాతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. నబి బౌలింగ్లో భారీ షాట్కు వెళ్లిన మాథ్యూస్.. రషీద్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత శనక (0) ఔటయ్యాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.
ఆప్ఘన్ టాపార్డర్ బ్యాట్స్మన్ అద్భుత ప్రదర్శన
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్థాన్ టాపార్డర్ మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముందుగా ఓపెనర్లు షెహజాద్ (34), ఇహ్సానుల్లా జట్టుకు శుభారంభాన్ని అందించారు. దీంతో తొలి 11 ఓవర్లలో జట్టు 50 పరుగులు చేసింది. 12వ ఓవర్ తొలి బంతిని సిక్సర్గా మలిచిన షెహజాద్ను అదే ఓవర్లో దనంజయ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇహ్సానుల్లా, రహమత్ నిలకడగా ఆడి రెండో వికెట్కు 50 పరుగులు జోడించారు. వరుస ఓవర్లలో ఇహ్సాన్, కెప్టెన్ అస్ఘర్ (1) అవుటైనా రహమత్కు హస్మతుల్లా (37) జత కలవడంతో ఆప్ఘన్ ఇబ్బందిపడలేదు. 35వ ఓవర్లో రహమత్ కెరీర్లో 15వ హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ చమీర వేసిన 42వ ఓవర్లో రహమత్ వెనుదిరగడంతో నాలుగో వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి లంక బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. మలింగ వేసిన 49వ ఓవర్లో రషీద్ (13) విజృంభించి రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఒకే ఓవర్లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో తిసార పెరీరా విజృంభించి మూడు వికెట్లు తీయడంతో జట్టు ఆలౌటైంది.
లంక జట్టులో చెప్పుకొదగ్గది బౌలర్గా తిషారా పెరీరా
రెండు మ్యాచ్ల్లో కాస్త నిలకడగా ఎవరైనా రాణించారంటే అది తిషారా పెరీరా మాత్రమే. ఈ మ్యాచ్లో తిషారా పెరీరా (5/55), అకిల ధనుంజయ (2/39) తమ బౌలింగ్తో ఫరవాలేదనిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 250 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 41.2 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. ఆసియా కప్లో శ్రీలంకపై అఫ్ఘనిస్థాన్కు ఇదే తొలి విజయం. ఆప్ఘన్ క్రికెటర్ రహమత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.