హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా జరుగుతున్న సూపర్-4లో పాకిస్థాన్తో మ్యాచ్ను సరికొత్తగా మొదలుపెడతామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించిన భారత జట్టు ప్రదర్శనపై రోహిత్శర్మ సంతోషం వ్యక్తం చేశాడు.
దటీజ్ ధోని!: ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు, కానీ కెప్టెన్సీ ధోనీని వదల్లేదు
ఆదివారం పాకిస్థాన్తో జరగనున్న వన్డేలోనూ అదే స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (4/29) చెలరేగగా, భువనేశ్వర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 36.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ (83 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా, ధావన్ (40), ధోని (33) రాణించారు.
ఆసియా కప్: 'ఈ పునరాగమనాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా'
మ్యాచ్ అనంతరం రోహిత్శర్మ మాట్లాడుతూ "ఆరంభం నుంచే టీమిండియా మ్యాచ్పై పట్టు సాధించింది. మా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత లైట్ల వెలుగులోనూ మా బ్యాటింగ్ చక్కగా సాగింది. ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగిన ప్రదర్శన చేశారు. అలాంటి పిచ్పై బౌలర్లను రొటేట్ చేయడం చాలా ముఖ్యం" అని అన్నాడు.
"సరైన బంతులు సంధిస్తే తప్పక వికెట్లు దక్కుతాయన్నది అందరికీ తెలిసిందే. చాలా రోజుల తర్వాత వన్డే ఆడుతున్న జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. అతడితో పాటు అందరూ తమ వంతు కృషి చేశారు" అని రోహిత్ శర్మ అన్నాడు. ఆసియా కప్ టోర్నీలో శనివారం విశ్రాంతి దినం కావడంతో మ్యాచ్లు లేవు.
ఆదివారం టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై రోహిత్ శర్మ మాట్లాడుతూ "ప్రణాళిక ప్రకారం వెళ్తే ఏదైనా సులభంగా గెలవవచ్చు. పాకిస్థాన్తో మ్యాచ్ను సరికొత్తగా మొదలుపెడతాం. గత ప్రదర్శనను కొనసాగిస్తాం" అని తెలిపాడు.