విధి నిర్ణయించింది: 696 రోజుల తర్వాత 200వ వన్డేకి కెప్టెన్గా ధోని


హైదరాబాద్: ఆసియాకప్ సూపర్-4లో భాగంగా దుబాయి వేదికగా భారత్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ అస్గర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆశ్చర్యంగా టాస్కు రోహిత్ శర్మ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు.
టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఫైనల్కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ నుంచి టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. దీంతో ఈ మ్యాచ్కు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టాడు. అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్కు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం.

అంతేకాదు కెప్టెన్గా ధోనికి ఇది 200వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత దాదాపు రెండేళ్లకు మరోసారి ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది. టాస్ అనంతరం ధోని మాట్లాడుతూ "ఇద్దరు ఓపెనర్లు(రోహిత్ శర్మ, శిఖర్ ధావన్) మిస్సింగ్. భువీ, బుమ్రా, చాహాల్ కూడా మిస్సయ్యారు. ఈ పర్యటనకు వచ్చిన 15 మందికీ భారత జట్టులో స్థానం ఉండాలన్నదే తమ ఉద్దేశం. కెప్టెన్గా 200వ వన్డేకి బాధ్యతలు స్వీకరించడం విధి. విధిరాతంటే ఇదేనేమో. 199 వన్డేలకు సారథిగా చేశాను. ఈ మ్యాచ్తో 200 పూర్తి చేస్తున్నా. అందుకే విధిరాతను నమ్ముతాను. రెండొందలు పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నాడు.

అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు
భారత జట్టు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న తొలి అంతర్జాతీయ టోర్నీలోనే భారత్కు టీ20 వరల్డ్ కప్ను అందించాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.

2011లో వన్డే వరల్డ్కప్ అందించిన ధోని
ఆ తర్వాత స్వదేశంలో భారత్కు వన్డే వరల్డ్ కప్ను అందించాడు. 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ధోని నాయకత్వంలోని టీమిండియా ముంబైలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. నువాన్ కులశేఖర బౌలింగ్లో ధోని భారీ సిక్సు బాది భారత్కు విజయాన్ని కట్టబెట్టాడు.

2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన ధోని
2013లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. ఇలా ఐసీసీ నిర్వహించే మూడు మేజర్ టోర్నీలను నెగ్గిన భారత కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ధోని నాయకత్వంలోని టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని సైతం సొంతం చేసుకుంది.

2015లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని
టెస్టు క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన ధోని, 2015లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుని విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సరిగ్గా 696 రోజుల తర్వాత మరోసారి భారత జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications