న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించే సువర్ణవకాశాన్ని అరుణాచల్ ప్రదేశ్ బ్యాట్స్మన్ రాహుల్ దలాల్ చేజార్చుకున్నాడు. 1999-2000 రంజీ సీజన్లో లక్ష్మణ్ 1415 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మన్గా అరుదైన రికార్డును నెలకొల్పాడు.
20 ఏళ్ల నుంచి ఆ రికార్డు చెక్కు చెదరకుండా పదిలంగానే ఉంది. అయితే తాజా సీజన్లో లక్ష్మణ్ను సమీపించిన రాహుల్ దలాల్.. మేఘాలయతో జరిగిన తమ చివరి రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఒక రంజీ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన లక్ష్మణ్ రికార్డును బద్దలుకొట్టే అవకాశాన్ని రాహుల్ చేజార్చుకున్నాడు.
అయితే, ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న మేఘాలయ బ్యాట్స్మన్ మిలింద్కుమార్(1331)ను మాత్రం రాహుల్ (1340) అధిగమించాడు. ఈ సీజన్లో అరుణాచల్ ప్రదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్కు వెళ్లే అవకాశాలు కోల్పోయింది. దీంతో రాహుల్కు లక్ష్మణ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం లేకపోయింది.
ఈ జాబితాలో లక్షణ్ అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ దలాల్, మిలింద్ కుమార్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక మూడు, నాలుగు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ (1321), పీకే పంచల్ (1310) ఉన్నారు. అయ్యర్ 2015-16 సీజన్లో ఈ ఘనతనుందుకోగా.. పేకే పంచల్ 2016-17 సీజన్లో టాప్స్కోరర్గా నిలిచాడు. ఇక డబుల్, ట్రిపుల్ సెంచరీలతో చెలరేగిన ముంబై సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ 928 పరుగులతో ఈ సీజన్ను ముగించాడు. కేవలం 6 మ్యాచ్ల్లోనే అతను ఈ పరుగులు చేయడం విశేషం.