నాటింగ్హామ్: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్తో మూడో టెస్టులో అద్భుత విజయం సాధించింది. రెండు టెస్టుల పరాజయానికి భారీ పట్టుదలతో శ్రమించి ఇంగ్లాండ్కు 1-2తో ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ మ్యాచ్లో కీలకంగా వ్యవహరించి బ్యాటింగ్తో పరుగుల వరద పారించిన కోహ్లీని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఘనతను కోహ్లీ తానొక్కడికే కాకుండా జట్టు మొత్తానికి ఆపాదించాడు.
అంతేకాదు మ్యాచ్ గెలిచిన ప్రైజ్ మనీ 1.26 కోట్ల రూపాయలను కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటించారు. కేరళ బాధితుల పట్ల కోహ్లీ చూపించిన ఔదార్యం అక్కడితో ఆగిపోలేదు. మానవాళితో పాటు తీవ్రంగా నష్టపోయిన జంతుజాలాన్ని ఆదుకునేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో పరిసరాల్లో ఉన్న కుక్కలకు.. ఇంకొన్ని జంతువులకు వైద్య సహాయం అందించనున్నారు. కొన్ని బృందాలను నియమించి వారికి ఆహారం, వైద్యానికి సరిపడ అవసరాలను ట్రక్కులలో తీరుస్తున్నారు.
ఒక లోకల్ ఎన్జీఓ లా ఏర్పడి జంతువులను సంరక్షించే పనిలో పడ్డారు. జంతుజాలానికి అత్యవసర సహాయాన్ని అందించి వాటిని కాపాడుతున్నారు. టీమిండియా కెప్టెన్గా కోహ్లీ ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన మ్యాచ్లో విజయాన్ని కూడా కేరళ వరద బాధితులకు అంకితం ఇచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడిన కెప్టెన్ 'మేం జట్టుగా ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నాం. ఇప్పటికే వారు చాలా కోల్పోయారు. వారి కోసం మేం కనీసం ఇదైనా చేయాలనుకుంటున్నాం' అని వివరించాడు.
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా జరగనున్న నాలుగో టెస్టు సౌతాంప్టన్ వేదికగా రోజ్ బౌల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్కు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. టీమిండియా విజయం సాధించినప్పటికీ జట్టులో అనూహ్య మార్పులు చేపట్టింది. దినేశ్ కార్తీక్.. మురళీ విజయ్లకు బదులు పృథ్వీ షా.. హనుమ విహారీలకు స్థానం కల్పించింది.