యో-యో టెస్టు పాసైన అంబటి రాయుడు
రెండోసారి యో-యో టెస్టు పాసైన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా ఏ, దక్షిణాఫ్రికా ఏ జట్లతో జరిగిన చతుర్ముఖ సిరిస్లో అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన చేశాడు. రాయుడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతన్న ఆసియా కప్లో చోటు కల్పించారు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో టోర్నీలో భాగంగా జరిగిన మొదటి నాలుగు మ్యాచ్ల్లో మూడో నెంబర్ స్థానంలో ఆడిన అంబటి రాయుడు, సూపర్-4లో భాగంగా ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు.
696 రోజుల తర్వాత కెప్టెన్గా ధోని
ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఫైనల్కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ నుంచి టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. దీంతో ఈ మ్యాచ్కు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టాడు. అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్కు కెప్టెన్సీ వహించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత దాదాపు రెండేళ్లకు మరోసారి ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది.
ఆప్ఘన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా రాయుడు
చాలా రోజుల తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ధోని మాత్రం ఎప్పటిలాగే కెప్టెన్ కూల్గానే ఈ మ్యాచ్లో కూడా వ్యవహారించాడు. హైదరాబాద్కు చెందిన అంబటి రాయుడు ఆసియా కప్ టోర్నీలో తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లాడిన అంబటి రాయుడు 57.67 యావరేజితో 173 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హాంకాంగ్తో జరిగిన తొలి మ్యాచ్లో 70 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
పాక్పై టీమిండియాను గెలిపించిన రాయుడు
ఇక, పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో 31 పరుగులు నమోదు చేశాడు. అంతేకాదు మరో బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్(37 బంతుల్లో 31 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం రాయుడు (28 బంతుల్లో 13) విఫలమయ్యాడు. ఆ తర్వాత సూపర్-4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 18 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక, సూపర్-4లో భాగంగా ఆప్ఘనిస్తాన్తో భారత్ ఆడిన చివరి మ్యాచ్లో రాయుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఆప్ఘన్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ
49 బంతుల్లో 57 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్(66 బంతుల్లో 60)తో కలిసి తొలి వికెట్కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసియా కప్ టోర్నీ కోసం టీమిండియాను ప్రకటించినప్పుడు మిడిలార్డర్ గురించి తీవ్రచర్చ జరిగింది. మిడిలార్డర్లో రెండు స్థానాల కోసం రాయుడు, దినేశ్ కార్తీక్, మనీష్ పాండే, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్ల తీవ్రమైన పోటీ నెలకొని ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీరందరిలో అంబటి రాయుడు సూపర్ ఫామ్లో కలిసొచ్చే అంశం.
నాలుగో స్థానానికి రాయుడు ఓకే
మరోవైపు దినేశ్ కార్తీక్ కూడా రాణిస్తున్నాడు. రాయుడు ఇలాగే తన ప్రదర్శనను కొనసాగిస్తే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్లో మిడిలార్డర్లో ఏదో ఒక స్థానాన్ని దక్కించుకోవడ ఖాయం. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగి జట్టులోకి వస్తే అంబటి రాయుడు నాలుగో నెంబర్ స్థానానికి చక్కగా సరిపోతాడు. రాయుడు వన్డే కెరీర్ యావరేజి కూడా అద్భుతంగా ఉండటమే ఇందుకు కారణం.