
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నటీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన ప్రతి ఒక్కరి గుండెల్లో ఆగ్రహా జ్వాలలు రగిలిస్తుంది. నిందితులని వెంటనే ఉరితీయాలని దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీటర్ వేదికగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ప్రియాంక రెడ్డి ఘటనపై టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు కూడా స్పందించాడు.
ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నిందితుల్ని వెంటనే ఉరి తీయాల్సిందేనని ట్వీటర్లో రాయుడు రాసుకొచ్చాడు. 'మహిళ శరీరాన్ని దోచుకోవాలని చూసే వారికి ఇదొక గుణపాఠం కావాలి. నిందితుల మెడలను గట్టిగా బిగించి ఉరి తీయండి. ఎక్కువ ఆలోచన అవసరం లేదు. ఉరే సరైంది' అని రాయుడు ట్వీట్ చేశాడు.
ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటనపై కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. 'హైదరాబాద్లో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. సమాజంలో మనం అందరం బాధ్యత తీసుకుని ఇలాంటి అవమానవీయ ఘటనలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది' అని కోహ్లీ ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండించారు.
గురువారం రాత్రి శంషాబాద్లో ప్రియాంక రెడ్డిని ఇద్దరు లారీ డ్రైవర్తో పాటు మరో ఇద్దరు క్లీనర్లు సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ప్రియాంకకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో మెడిసిన్లో సీటు వచ్చినా.. వెటర్నటీ కోర్సు చదివింది. చిన్నప్పటి నుంచి కుక్కలు, ఆవులు, గుర్రాలకు ఆహారం తినిపించేది. కొన్ని జంతువులను పెంచుకోవాలనుకుంది. కానీ.. ఇల్లు చిన్నగా ఉండడం వల్ల అది కుదరలేదు.