అంబటి రాయుడు
ఈ జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు అంబటి రాయుడు. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. చాలా ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన అంబటి రాయుడిని ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో కొనుగోలు చేయలేదు. దీంతో చెన్నై యాజమాన్యం రాయుడిని వేలంలో రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది. టాప్ ఆర్డర్లో ఆడించింది. చెన్నై తనపై పెట్టిన నమ్మకాన్ని రాయుడు వమ్ము చేయలేదు. గత నాలుగు ఇన్నింగ్స్ల్లో వరుసగా 79, 82, 46, 41 పరుగులతో చెన్నై జట్టుని విజయతీరాలకు చేర్చాడు. మొత్తం 8 మ్యాచ్ల్లో 370 పరుగులతో టోర్నీ టాప్స్కోరర్గా కొనసాగుతున్నాడు.
కేఎల్ రాహుల్
అరంగేట్ర వన్డేలో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్ కేఎల్ రాహుల్. జాతీయ జట్టులోకి వచ్చీరావడంతోనే తనదైన ముద్ర వేశాడు. గత రెండు సీజన్లలో బెంగళూరు తరపున ఆడిన రాహుల్ ప్రస్తుత సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ని పంజాబ్ జట్టు వేలంలో రూ.11 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంత ధర పలకడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగినట్లుగానే బరిలో దిగిన మొదటి మ్యాచ్లోనే ఐపీఎల్లో వేగవంతమైన అర్ధసెంచరీ (14 బంతుల్లో) చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కూడా నిలకడగా రాణిస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఇప్పటివరకూ ఏడు మ్యాచ్ల్లో 170.70 స్ట్రైక్ రేట్తో రాహుల్ 268 పరుగులు చేశాడు.
క్రిస్ గేల్
ఐపీల్కు పరిచయం అక్కర్లేని పేరు క్రిస్ గేల్. ఐపీఎల్ మొదటి రెండు సీజన్లలో కోల్కతా తరపున ఆడిన గేల్.. ఆ తర్వాత బెంగళూరుకు మారాడు. కొన్నేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఐపీఎల్లో ఆడాడు క్రిస్ గేల్. వయసు మీద పడడం, ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండడంతో వేలంలో క్రిస్ గేల్ను తీసుకోవడానికి ఏ జట్టు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే చివర్లో పంజాబ్ అతణ్ని కనీస ధర రూ.2 కోట్లకే సొంతం చేసుకుంది. పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో గేల్కు చోటు కల్పించలేదు. మూడో మ్యాచ్లో బరిలో దిగిన గేల్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో 126 యావరేజితో 252 పరుగులు చేశాడు.
ట్రెంట్ బౌల్ట్
న్యూజిలాండ్కు చెందిన ట్రెంట్ బౌల్ట్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉన్నప్పటికీ.... తాను మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. గత సీజన్లో కోల్కతా తరపున ఆడిన బౌల్ట్ అంచనాల మేర రాణించలేకపోయాడు. దాంతో వేలంలో కోల్కతా అతడిని కొనుగోలు చేయలేదు. అయితే ఢిల్లీ ట్రెంట్ బౌల్ట్ను రూ.2.2 కోట్లకు సొంతం చేసుకుంది. సీజన్ మొదట్లో తడబడిన బౌల్ట్ ఆ తర్వాత మంచి లయ, పేస్తో వికెట్లు తీస్తున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ల్లో 24.90 యావరేజితో 11 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.