హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనాకు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అండగా నిలిచాడు. భారత జట్టులోకి రైనా ఖచ్చితంగా పునరాగమనం చేస్తాడన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్న రాయుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
లైవ్ సెషన్ సందర్భంగా ఈ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ను రైనా గురించి అడగ్గా.. అతనిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందన్నాడు. అతి త్వరలోనే అతను రీ ఎంట్రీ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. 'రైనాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. అతను భారత జట్టులోకి పునరాగమనం చేయగలడని బెట్ కూడా కడ్తా. అతని పవర్ ఏంటో లాక్డౌన్ ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో తెలిసింది.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.
ధోనీ సారథ్యంలో భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్గా ఓ వెలుగు వెలిగిన రైనా.. అనంతరం నిలకడలేమి ఆటతో జట్టుకు దూరమయ్యాడు. భారత తరఫున చివరిసారిగా 2018లో ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మాత్రం కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. నిలకడైన ఫామ్తో అదరగొడుతున్నాడు. గత సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన రైనా 383 పరుగులు చేశాడు.
ఇక వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు కోసం నీరీక్షించి భంగపడ్డ రాయుడు.. సెలెక్టర్లపై కోపంతో అంతర్జాతీయ వీడ్కోలు పలికాడు. అనంతరం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని లీగ్స్ ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ జట్టును నడిపించిన రాయుడు.. రంజీ ట్రోఫీ నుంచి మాత్రం తప్పుకున్నాడు. హైదరాబాద్ జట్టులో రాజకీయాలు ఎక్కువయ్యాయని, టాలెంటెడ్ ప్లేయర్లకు చోటులేదని హెచ్సీఏ అధికారులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2018 నుంచి ఐపీఎల్లో చెన్నైకి ఆడుతున్న రాయుడు.. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
కరోనా ఎఫెక్ట్: భారత స్టార్ ప్లేయర్లు కాస్త రైతు కూలీలుగా..