
హైదరాబాద్: పరిపాలనా వ్యవహారాలను తాత్కాలికంగా పర్యవేక్షించే విషయంలో బీసీసీఐ ఉమ్మడి హైకోర్టుకు నివేదన పంపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)
మాజీ న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీని మరికొంత కాలం కొనసాగించాలంటూ అందులో పేర్కొంది. హెచ్సీఏలో లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడంతోపాటు బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్ నిర్వహణను పర్యవేక్షించేందుకు సైతం ఓ ఏర్పాటు చేసింది బీసీసీఐ.
దీని నిమిత్తం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలతో గతంలో హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వేసింది. అయితే ప్రస్తుతం వీరి బాధ్యతలు ముగియడంతో ఆ కమిటీని మరికొంత కాలం పొడిగించాలంటూ బీసీసీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
హెచ్సీఏలో లోధా కమిటీ సిఫారసులను అమలు చేసేలా ఆదేశాలు జారీచేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలనకు పంపింది. ఈ విషయమై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.
లోధా కమిటీ సిఫార్సులు అమలు చేస్తున్న నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ కమిటీ తప్పుకోనున్న విషయాన్ని బీసీసీఐ న్యాయవాది నివేదించారు. దీనికి తాత్కాలిక పరిష్కారంగా కమిటీని మరికొంత కాలం కొనసాగించాలని ఆయన తెలిపారు. ఇక, తెలంగాణ టీ 20 పేరుతో నిర్వహించిన మ్యాచ్లో అక్రమాల గురించి చర్చించారు.
ఈ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి అఫిడవిట్ దాఖలు చేశారని తెలిపారు. అలాగే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఇచ్చిన నివేదికను కూడా ధర్మాసనానికి అందజేశారు. ఈ నివేదికను అడ్మినిస్ట్రేషన్ కమిటీకి ఇస్తామని, దీన్ని ఎవరికి ఇవ్వాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.