
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో స్పందించాడు. "అంబటి, భారత క్రికెట్కు నీవు చేసిన సేవలకు కృతజ్ఞతలు. ముంబై ఇండియన్స్కు నీవు ఆడిన సమయంలో ఎన్నో మధురస్మృతులు ఉన్నాయి. నీ సెకండ్ ఇన్నింగ్స్లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
వీడ్కోలు నిర్ణయానికి కారణం ఏమిటో అతను చెప్పకున్నా.. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో చోటు దక్కకపోవడం వల్లే మనస్తాపం చెందిన అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. స్టాండ్ బై లిస్ట్లో ఉన్న తనను కాదని మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకోవడంతో అంబటి రాయుడు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
తన రిటైర్మెంట్ లేఖను బీసీసీఐ గవర్నింగ్ విభాగంతో పాటు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరికి పంపించారు. వీరితో పాటు బీసీసీఐ జనరల్ మేనేజర్ సాబాకరీం, రాహుల్ జోహ్రీలకు కాపీ పెట్టాడు. అంబటి రాయుడు రిటైర్మెంట్ లేఖ సారాంశం ఇదే:
తన కేరీర్లో తాను ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహకరించిన వారందరికీ ఈ ఇమెయిల్ ద్వారా అంబటి రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు. నేను అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను.. అంటూ రాయుడు తన ఇమెయిల్ను ఆరంభించారు. తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. తన కేరీర్ ఆరంభానికి సహకరించిన రాష్ట్రస్థాయి క్రికెట్ అసోసియేషన్లను కృతజ్ఞుడినై ఉంటానని పేర్కొన్నాడు. హైదరాబాద్, బరోడా, ఆంధ్ర, విదర్భలకు తాను ప్రాతినిథ్యం వహించానని వివరించాడు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ ఫ్రాంఛైజీలు తనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో చోటు కల్పించాయని గుర్తు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కేప్టెన్సీలో తాను జాతీయ జట్టుకు ఆడానని, ఈ సందర్భంగా వారందరూ తనను ప్రోత్సహించారని చెప్పాడు. ప్రత్యేకించి విరాట్ కోహ్లీ.. తనపై అచంచల విశ్వాసాన్ని ఉంచేవాడని అన్నాడు.
జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తన జీవితంలో మరపురాని మధుర స్మృతులను అందించిందని చెప్పాడు. తన క్రికెట్ ప్రస్థానానికి సహకరించిన తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆప్తమిత్రులు, బంధువులకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నాడు.