India vs Australia: ప్చ్.. ఫస్ట్ వన్డేలో భారత్కు చుక్కెదురు.. ఆల్రౌండ్ షోతో ఆసీస్ ఘన విజయం!

సిడ్నీ: కరోనా బ్రేక్ అనంతరం ఆడిన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో భారత్కు చుక్కెదురైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో కోహ్లీసేన 66 పరుగులతో చిత్తుగా ఓడింది. ఆతిథ్య ఆస్ట్రేలియా సమష్టి ప్రదర్శన కనబర్చగా.. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన టీమిండియా సుదీర్ఘ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ ( 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్లతో 114), స్టీవ్ స్మిత్ (66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (76 బంతుల్లో 6ఫోర్లతో 69), గ్లెన్ మాక్స్వెల్ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 45) మెరుపు ఇన్నింగ్స్తో రాణించారు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ (3/59) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా( 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 90), శిఖర్ ధావన్(86 బంతుల్లో 10 ఫోర్లతో 74) రాణించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, హజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్ ఓ వికెట్ తీశాడు. సెంచరీతో రాణించిన స్మిత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ గెలుపుతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

విఫలమైన విరాట్..
374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ల మయాంక్ అగర్వాల్(22), శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించినప్పటికీ.. ఆ జోరును కొనసాగించలేకపోయారు. రోహిత్ శర్మ గైర్హాజరీతో ఓపెనర్గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ బంగారం లాంటి అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. హజల్వుడ్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెక్లెస్ షాట్తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 1 పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్ను ఆడమ్ జంపా జారవిడిచాడు. అనంతరం బౌండరీలతో చెలరేగిన కోహ్లీ క్రీజులో కుదురుకుంటున్నట్లు కనిపించాడు. కానీ హజల్వుడ్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించి ఫించ్కు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్(2) కీపర్ క్యాచ్గా వెనుదిరిగి నిరాశపర్చగా.. కేఎల్ రాహుల్.. ఫార్వార్డ్లో స్మిత్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న ధావన్, పాండ్యా..
ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. బాధ్యతాయుతంగా ఆడిన ఈ జోడీ మంచి బంతులను గౌరవిస్తూ వీలు చిక్కిన బాల్స్ను బౌండరీలకు తరలించింది. ఓవైపు ధావన్ నిదానంగా ఆడినా.. మరోవైపు పాండ్యా చెలరేగాడు. జంపా వేసిన 18వ ఓవర్లో సిక్స్, ఫోర్తో టచ్లోకి వచ్చిన పాండ్యా.. క్విక్ సింగిల్స్, డబుల్స్తో జట్టు స్కోర్ను పరుగెత్తించాడు. మ్యాక్స్వెల్ వేసిన 23వ ఓవర్లో 4, 6, 6తో 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన 25వ ఓవర్ ఫస్ట్ బాల్ను ధావన్ డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్ ఆడగా.. కమిన్స్ క్యాచ్ జారవిడచడంతో ఫోర్ వచ్చింది. దాంతో ధావన్ అర్థ సెంచరీ పూర్తయింది. ఆచితూచి ఆడిన ఈ జోడీ జట్టును విజయంవైపు నడిపించింది.

38 మ్యాచ్ల తర్వాత..
ఇక క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని జంపా విడదీసాడు. శిఖర్ ధావన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి ఐదో వికెట్కు నమోదైన 128 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఇక ధావన్, పాండ్యా కలిసి ఇప్పటి వరకు 38 మ్యాచ్లు ఆడినా.. ఇంతవరకు కలిసి బ్యాటింగ్ చేయలేదు. ఈ మ్యాచ్లోనే ఈ ఇద్దరూ కలిసి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక బంతిని తప్పుగా అంచనా వేసి భారీ షాట్కు ప్రయత్నించిన ధావన్ స్టార్క్కు చిక్కాడు. మరికొద్ది సేపటికే హార్ధిక్ కూడా జంపా బౌలింగ్లో ఔటవ్వడంతో భారత ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో జడేజా(25), షమీ(13)లు వచ్చినా.. భారీ లక్ష్యం కారణంగా ఏం చేయలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications