|
రహానే ఇది పద్దతేనా?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో బరిలోకి దిగిన రహానే ఇంత నిర్లక్ష్యంగా ఔటవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రహానే ఇలానే ఔటైతే అతని కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు రహానే సారథ్యంలో సుధీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ తన ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ విఫలమైన వేళ.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
|
రహానే నీ మొగుడు వచ్చాడు..
అయ్యర్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ రహానేను అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.'రహానే.. శ్రేయస్ అయ్యర్ సూపర్ పెర్ఫామెన్స్తో నీ ప్లేస్కే ఎసరు పెడుతున్నాడు. నీకు మొగుడిలా తయారయ్యాడు'అని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ అందుబాటులోకి రాగానే వేటు పడేది రహానేపైనేనని, విఫలమవుతున్న పుజారా, రహానేకు బ్యాకప్గానే అయ్యర్ను ద్రవిడ్ సిద్దం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. రంజీ క్రికెట్లో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఘనతను అందుకున్న అయ్యర్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి చాలా రోజులు అయినా.. అతన్ని ద్రవిడ్ ఇందుకే ఎంపిక చేశాడంటున్నారు.
|
గంభీర్ చెప్పింది వాస్తవమే..
కేవలం కెప్టెన్గా పనికొస్తాడనే అజింక్యా రహానే జట్టులో కొనసాగుతున్నాడని, అది అతని అదృష్టమని ఈ మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ విమర్శించాడు. అయితే రహానే తాజా వైఫల్యం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావిస్తున్న అభిమానులు.. అవి వాస్తవమేనని చెబుతున్నారు. 'కెప్టెన్ అయి బతికిపోయావు.. లేకుంటే ఎప్పుడో పక్కనపెట్టేవారు.. నాకు తెలిసి రహానే తర్వాతి మ్యాచ్ ఆడడం కష్టమే.. రహానేకు గడ్డుకాలం నడుస్తుంది.. ఇంకా ఎన్నాళ్లు వెంటాడుతుందో చూడాలి.. పెద్ద స్కోర్ చేస్తాడు అన్న ప్రతీసారీ వికెట్ ఇచ్చేసుకుంటాడు.. రహానే నుంచి పెద్ద స్కోరు ఆశించడం ఇక వ్యర్థం ''అని ఓ యూజర్ ఘాటుగా కామెంట్ చేశాడు.
జడేజా హాఫ్ సెంచరీ..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రేయస్ అయ్యర్కు అండగా నిలిచిన రవీంద్ర జడేజా సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 145 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అయ్యర్, జడేజా ఆదుకున్నారు. మూడో సెషన్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ చెలరేగారు. కివీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశారు.
ఈ క్రమంలో అయ్యర్ ముందుగా హాఫ్ సెంచరీ చేసి పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత జడేజా సైతం హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 రన్స్ చేసింది. క్రీజులో అయ్యర్(75 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(50 బ్యాటింగ్) ఉన్నారు.