సొంతగడ్డపై వరుసగా మూడో శతకం
తాజాగా సొంతగడ్డపై కరీబియన్ జట్టుపై వరుసగా మూడో శతకం బాదేశాడు కోహ్లీ. పుణెలో విండీస్పై కోహ్లి చేసిన సెంచరీ వన్డేల్లో అతనికి 38వది కావడం విశేషం. ఈ రికార్డు ఇప్పటి వరకు భారత్లో ఏ ఆటగాడికీ లేదు. అతని స్పీడు క్రికెట్లోని చాలా మంది దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తున్నది. అతని ఆటను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు.
ధోనీని దాటేసి.. మూడో వన్డేలో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ
అక్తర్ ట్విటర్లో విరాట్పై ప్రశంసలు
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ట్విటర్లో విరాట్పై ప్రశంసలు కురిపించాడు. దాహం తీరని ‘కింగ్ కోహ్లీ'కి రావల్పిండి ఎక్స్ప్రెస్ ఓ అరుదైన సవాల్ విసిరాడు. 38వ వన్డే సెంచరీ బాదిన అతడికి 120 శతకాలు ఖాతాలో వేసుకోవాలని ఓ బెంచ్మార్క్ నిర్దేశించాడు.
|
120 శతకాల బెంచ్మార్క్ దాటేయాలి
‘గువాహటి. విశాఖపట్నం. పుణె. వరుసగా మూడు వన్డేల్లో శతకం బాదిన కోహ్లీ మానవాతీతుడులా కనిపిస్తున్నాడు. అతడు ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు. అబ్బో.. అతడో పరుగుల యంత్రం.. దీన్నిలాగే కొనసాగించు. 120 శతకాల బెంచ్మార్క్ దాటేయాలి. ఇది నీకోసం నేను నిర్దేశిస్తున్న లక్ష్యం' అని షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు. విరాట్ సెంచరీ కొట్టేసినా మూడో వన్డేలో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
సచిన్ వంద సెంచరీల రికార్డుకు దూరంలోనే
అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్. అలాంటిది కోహ్లికి అక్తర్ 120 సెంచరీల మార్క్ను లక్ష్యంగా పెట్టాడు. తన టార్గెట్ను కోహ్లి మించిపోవాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం కోహ్లి టెస్టుల్లో 24, వన్డేల్లో 38 సెంచరీలు చేశాడు. ఓవరాల్గా 62 సెంచరీలతో ఉన్నాడు. అయినా సచిన్ వంద సెంచరీల రికార్డుకు ఇంకా చాలా దూరంలోనే విరాట్ ఉన్నాడు.