అడిలైడ్: మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా జరుగుతున్న సన్నాహక మ్యాచ్లో శ్రీలంక మహిళా క్రికెటర్ అచిన కులసురియా తీవ్రంగా గాయపడింది. ఫీల్డింగ్ చేస్తూ బంతిని తప్పుగా అంచనా వేయడంతో అదికాస్త నేరుగా కులసురియా నెత్తినపడింది. తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలో కుప్పకూలిపోయింది.
డివిలియర్స్ టీ20 వరల్డ్కప్ ఆడుతాడు : సౌతాఫ్రికా కోచ్
దాంతో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించిన టీమ్ ఫిజియో..కులసురియా పరిస్థితి విషమంగా ఉందని గ్రహించి హుటాహుటిన స్ట్రెచర్పై ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. లాంగాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న కులసురియా... దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రయాన్ కొట్టిన బంతిని తప్పుగా అంచనా వేసి గాయపడింది. బంతి బలంగా తాకడంతో మోకాళ్లపై కూలబడిపోయిన కులసురియా చేతులతో నెత్తిన పట్టుకొని విలవిల్లాడిపోయింది.
ఆమెను వెంటనే తదుపరి పరీక్షల కోసం రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి జట్టుతో చేరిందని శ్రీలంక అధికారప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో శ్రీలంక మహిళలు 41 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక శ్రీలంక తమ తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్ ఇంగ్లండ్తో మంగళవారం ఆడనుంది.
ఈ నెల 21న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ మెగాటోర్నీకి తెరలేవనుండగా.. శ్రీలంక 22న న్యూజిలాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.