ఆ విషయంలో.. కేఎల్ రాహుల్కు 10కి 7.5 మార్కులు!!

ముంబై: యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020లో తొలిసారిగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. లీగ్ ఆరంభంలో వరుస వైఫల్యాలతో డీలా పడిన జట్టును.. ప్లే ఆఫ్స్ దిశగా తీసుకెళ్లాడు. అయితే చివరి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలుకావడంతో పంజాబ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. అయితే అద్భుత ప్రదర్శన చేసిన రాహుల్ సేన మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది. సీజన్ మొదటి అర్ధభాగంలో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన పంజాబ్.. క్రిస్ గేల్ రాకతో ఊహించని విధంగా వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి సత్తాచాటింది. ఇక వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన కేఎల్ రాహుల్.. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు.

కెప్టెన్సీ తొలిసారి అయినా:
ఐపీఎల్ 2020లో 14 మ్యాచుల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్న కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కెప్టెన్సీ తొలిసారి అయినా బాగానే ఆకట్టుకున్నాడని మాజీలు అభిప్రాయపడ్డారు. అంతేకాదు పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు వైస్ కెప్టెన్ కూడా అయ్యాడు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా మాత్రం కేఎల్ రాహుల్ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా అతడికి పదికి ఏడున్నర మార్కులు వేస్తానని చెప్పుకొచ్చాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వ లక్షణాలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

10కి 7.5 మార్కులు:
'కేఎల్ రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పను, అలాగని మరీ అంత బాగాలేదని చెప్పలేను. అతడి ప్రదర్శన 50-50గా ఉంది. పంజాబ్ జట్టు వైఫల్యాలకు కెప్టెన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబరిచే తుది జట్టును ఎంచుకోవడంలో అతడు తడబడ్డాడు. ఎంపికలో యాజమాన్య నిర్ణయం కూడా ఉంటుందని తెలుసు. అయితే రాహుల్ కూడా తన మార్కు చూపాల్సింది. ఇదంతా పక్కనపెడితే ఈ సీజన్లో రాహుల్ బాగానే ఆకట్టుకున్నాడు. అయితే సారథిగా తను ఇంకొంత మెరుగవ్వాల్సి ఉంది. కెప్టెన్సీ విషయంలో రాహుల్కు నేను 10కి 7.5 మార్కులు ఇస్తున్నా' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

వైస్ కెప్టెన్గా:
సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ ఫామ్ ఆధారంగా కొందరు యువ ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. కండరాల గాయం వల్ల టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్ల్లో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో లోకేశ్ రాహుల్ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దీంతో బీసీసీఐ అతడికి సరైన గుర్తింపు ఇచ్చింది. ఇక భవిష్యత్తులో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యం లేదు.

మూడు పాత్రల్లో:
గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తోన్న కేఎల్ రాహుల్ భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. భారత జట్టుకు వికెట్ కీపర్ పాత్రలోనూ అదరగొడుతున్నాడు. ఓపెనర్, మిడిల్ ఆర్డర్ ఎక్కడ ఆడినా.. పరుగులు చేస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2020లో మూడు పాత్రల్లో (బ్యాట్స్మన్, కెప్టెన్, కీపర్) రాణించి ఔరా అనిపించాడు.
India Vs Australia: 'బుమ్రాను త్వరగా అలసిపోయేలా చేయాలి.. లేదంటే సిరీస్ గెలవలేం'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications