ఒక్క ఇన్నింగ్స్ రెండు గంటలా?
ఇదే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో స్లో ఓవర్రేట్కు కారణమైన చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీపై రూ.12 లక్షల జరిమానా పడిన విషయం తెలిసిందే. అయితే తాజా మ్యాచ్ కూడా నిర్ణీత సమయంలో ముగియలేదని, దానికి బాధ్యులైన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రాజస్థాన్ సారథి సంజూ శాంసన్లపై జరిమానా విధించాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'ఇరు జట్లు గంటకు 10 ఓవర్లు మాత్రమే వేసాయి. ఈ మ్యాచ్లో ఎక్కువగా సిక్సర్లు నమోదయ్యాయి, అలాగే మ్యాచ్ చాలా టైట్గా సాగింది. కాదనలేను. కానీ ఓ టీ20 ఇన్నింగ్స్ ముగియడానికి రెండు గంటలు పట్టడం ఏ మాత్రం ఆహ్వానించదగినది కాదు. గత మ్యాచ్లో ధోనీపై జరిమానా విధించారు. ఈ మ్యాచ్ విషయంలో కూడా ఇరు జట్లకు జరిమానా పడుతుందునుకుంటున్నా.'అని చోప్రా ట్వీట్ చేశాడు.
సంజూ పోరాటం వృథా..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 రన్స్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్ హుడా(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64) పరుగుల సునామీ సృష్టించారు. వీరికి అండగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40) రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ మోరిస్కు రెండు, రియాన్ పరాగ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) సెంచరీతో ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.
గెలిపించిన అర్ష్దీప్ సింగ్..
చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. పంజాబ్ యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని వైడ్ యార్కర్తో డాట్ చేసిన అతను రెండో బంతికి సామ్సన్... మూడో బంతికి మోరిస్ సింగిల్స్ తీశారు. నాలుగో బంతిని సామ్సన్ సిక్సర్గా మలిచాడు. దాంతో రాజస్తాన్ గెలుపునకు 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఐదో బంతిని సామ్సన్ లాంగ్ఆఫ్ వద్దకు ఆడగా... మోరిస్ సింగిల్ కోసం వచ్చాడు. కానీ సామ్సన్ సింగిల్ వద్దనడంతో మోరిస్ వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో చివరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆరో బంతిని సామ్సన్ కవర్స్లో కొట్టిన భారీ షాట్ బౌండరీ దాటకుండా పంజాబ్ ఫీల్డర్ దీపక్ హుడా చేతికి చిక్కింది. దాంతో చేజారిందనుకున్న మ్యాచ్లో పంజాబ్ విజయాన్ని అందుకుంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో మ్యాచ్ ముగిసే సరికి ఆలస్యమైంది.
బీసీసీఐ రూల్స్ ప్రకారం..
ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్, అనూహ్య అంతరాయల సమయాన్ని మినహాయిస్తారు. కానీ రాజస్థాన్- పంజాబ్ మ్యాచ్ ముగియడానికి 4 గంటల సమయం పట్టింది. అయితే ఈ మ్యాచ్ల్లో మొత్తం 26 సిక్స్లు నమోదవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. ఈ సిక్స్లతో వృథా సమయాన్ని మినహాయించిన ఈ మ్యాచ్ నిర్ణీత సమయంలో ముగిసినట్లు అనిపించడం లేదు. దాంతో ఈ ఇద్దరి కెప్టెన్లకు ధోనీ తరహాలో జరిమానా పడే అవకాశం ఉంది.
నయా రూల్స్ ప్రకారం మొదటిసారి స్లోఓవర్ రేటుకు కారణమైతే సదరు జట్టు కెప్టెన్కు రూ. 12 లక్షల జరిమానా విధించనున్నారు. రెండోసారి అదే తప్పు చేస్తే.. కెప్టెన్కు రూ. 24 లక్షల జరిమానాతో పాటు జట్టులోని ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో నుంచి రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి అదే తప్పు రిపీట్ అయితే మాత్రం కెప్టెన్కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్ ఫీజులోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు.