ఇండియా Vs ఇంగ్లాండ్ - బెంగళూరు 2011
ధోని నాయకత్వంలో వన్డే మ్యాచ్ టైగా ముగియడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో సచిన్ టెండూల్కర్(115 బంతుల్లో 120) చెలరేగగా, అనంతరం గౌతం గంభీర్, యువరాజ్ సింగ్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలం కావడంతో చివరి ఆరుగురు బ్యాట్స్మెన్ కేవలం 60కిలోపే ఔటయ్యారు. అయినా సరే టీమిండియా స్కోరు బోర్డుపై 338 పరుగులు ఉంచింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగన ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ 145 బంతుల్లో 158 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత ఇయాన్ బెల్ 69 పరుగులతో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. 43 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. దీంతో విజయం ఇంగ్లాండ్దేనని అంతా భావించారు. ఈ దశలో పేసర్ జహీర్ ఖాన్ వరుస వికెట్లు తీయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఇండియా Vs ఇంగ్లాండ్ - లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 2011
2011 ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ చెత్త ప్రదర్శనను కనబరిచింది. ఈ పర్యటనలో టెస్టు సిరిస్ను 4-0తో, వన్డే సిరిస్ను 2-0తేడాతో చేజార్చుకుంది. దీంతో ఈ పర్యటన టీమిండియాకు ఓ పీడకలగా మారింది. ఈ మ్యాచ్లో భారత టాపార్డర్ బ్యాట్స్మెన్ నలుగురు రెండంకెల స్కోర్లు నమోదు చేశారు. ఈ మ్యాచ్లో ధోని-సురేశ్ రైనా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రైనా 75 బంతుల్లో 84 పరుగులు చేయగా, ధోని 71 బంతుల్లో 78 నాటౌట్గా నిలిచాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 280 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లను ఆర్పీ సింగ్ తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేర్చాడు. ఆనంతరం క్రీజులోకి వచ్చిన ఇయాన్ బెల్, రవి బొపారా కొంచెం సేపు వికెట్లు పడకుండా పోరాడారు. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో అంఫైర్లు మ్యాచ్ని నిలిపివేశారు. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టైగా ముగిసినట్లు అంఫైర్లు ప్రకటించారు.
ఇండియా Vs శ్రీలంక - అడిలైడ్ 2012
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందని అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా చివరకు టైగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. లంక జట్టులో చండీమాల్ 81 పరుగులతో టాస్ స్కోరర్గా నిలిచాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టులో ఓపెనర్ గౌతం గంభీర్ 91 అజేయ పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. దీంతో భారత్ విజయానికి 58 బంతుల్లో 50 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. దీంతో విజయం భారత్దే అనుకున్నారంతా. కులశేఖర బౌలింగ్లో గంభీర్ ఔటైన తర్వాత స్కోరు నెమ్మదించింది. మలింగ వేసిన ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 9 పరుగుల అవసరయ్యాయి. ఆఖరి ఓవర్లో కెప్టెన్ ధోని డిఫెన్సివ్గా ఆడటంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్ టైగా ముగియడానికి ధోనియే కారణమంటూ మ్యాచ్ అనంతరం తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇండియా Vs న్యూజిలాండ్ - ఆక్లాండ్ 2014
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 314 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 13.1 ఓవర్లకు భారత్ స్కోరు 72-2గా ఉంది. మిడిలార్డర్ రాణించడంతో 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 184-6గా ఉంది. దీంతో భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా. అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్, జడేజాలు 65, 66 పరుగులతో రాణించారు. 31 బంతుల్లో భారత్ విజయానికి 45 పరుగులు అవసరమైన తరుణంలో అశ్విన్ పెవిలియన్కు చేరాడు. అనంతరం జట్టుని గెలిపించే బాధ్యతను జడేజా తన భుజానికెత్తుకున్నాడు. 3 బంతుల్లో భారత్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. దీంతో జడేజా వరుసగా 4,6 బాదడంతో భారత శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తాయి. ఒక బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో జడేజా సింగిల్ తీయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఇండియా Vs ఆప్ఘనిస్థాన్ - దుబాయి 2018
దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధిస్తుందని అనుకుంటే, మ్యాచ్ అనూహ్యంగా టైగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అనంతరం 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. లక్ష్య చేధనలో భారత జట్టు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన అంబటి రాయుడు సిక్స్లతో చెలరేగాడు. రాహుల్ 55 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రాయుడు 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు.
దూకుడుగా ఆడే క్రమంలో రాయుడు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ సైతం పెవిలియన్కు చేరాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత భారత స్కోరు నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని (8), పాండే (8), జాదవ్ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత కార్తీక్ (44) ఔట్ కావడంలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్లో 7 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది. ఆప్ఘన్ కెప్టెన్ అస్గర్ బౌలర్ రషీద్ఖాన్కు బంతి ఇచ్చాడు. ఈ సమయంలో క్రీజులో ఉన్న ఆల్రౌండర్ జడేజా రెండో బంతికి ఫోర్ కొట్టి ఆశలు రేపాడు. ఆ తర్వాత మరో రెండు సింగిల్స్ రావడంతో స్కోర్ సమమైంది.