నో గేల్.. నో పురాన్
ఇక లీగ్లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని పంజాబ్.. ప్రతీసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగి చతికిల పడుతుంది. అద్భుతంగా రాణిస్తున్నా ఆ జట్టును ఏదో రూపంలో దురదృష్టం వెంటాడుతోంది. 2015 తర్వాత పంజాబ్ కనీసం ప్లే ఆఫ్ బెర్త్ కూడా దక్కిచ్చుకోలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ 2021 వేలంలో అనేక మంది కొత్త ఆటగాళ్లను తీసుకున్న పంజాబ్.. పేరు కూడా మార్చుకుంది. అయినా ఆ జట్టు రాత మారలేదు.
కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ ఫస్టాఫ్లో 8 మ్యాచ్లు ఆడిన పంజాబ్.. మూడింటిలో మాత్రమే గెలిచి ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఐపీఎల్ 2022 మెగా వేలం ఆ జట్టుకు మంచి అవకాశం. ఇతర జట్లలోని టాప్ స్టార్లను సొంతం చేసుకోవచ్చు. అయితే ఆ జట్టు ముగ్గురు భారత ప్లేయర్లను ఓ ఫారినర్ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, విండీస్ ప్లేయర్ నికోలస్ పురాన్ సేవలను ఆ జట్టు కోల్పోనుంది.
కేఎల్ రాహుల్..
పంజాబ్ తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ను రిటైన్ చేసుకుంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు సీజన్లలో పంజాబ్ దారుణంగా విఫలమైనా కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా దుమ్ములేపాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అయిన రాహుల్ 2018, 2019, 2020 సీజన్లలో వరుసగా 659, 593, 670 రన్స్ చేశాడు. దుబాయ్ వేదికగా జరిగిన గత సీజన్లలో హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
తాజా సీజన్లలో 7 మ్యాచ్లు ఆడిన రాహుల్.. 331 రన్స్తో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్గా ఉన్నాడు. ఓవరాల్గా 88 మ్యాచ్లు ఆడిన 29 ఏళ్ల రాహుల్.. 46.53 సగటుతో 2979 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలున్నాయి. నెమ్మదిగా ఆడుతానే అపవాదున్నా.. రాహుల్ నిలకడగా రాణిస్తాడు.
మయాంక్ అగర్వాల్..
రాహుల్ తర్వాత పంజాబ్ మయాంక్ అగర్వాల్ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఓపెనర్గా ఈ కర్ణాటక బ్యాట్స్మన్ గత రెండు సీజన్లలో నిలకడగా రాణించాడు. 2019లో 13 మ్యాచ్లు ఆడిన మయాంక్ 333, 2020లో 11 మ్యాచ్ల్లో 424 రన్స్ చేశాడు. తాజా సీజన్లో సైతం 7 మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 260 రన్స్ చేశాడు. ఇందులో 99 పరుగుల అజేయ ఇన్నింగ్స్ కూడా ఉంది. ఇప్పటి వరకు 95 మ్యాచ్లు ఆడిన మయాంక్.. 22.67 సగటుతో 1950 రన్స్ చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ ఉంది. భారత స్టార్ బ్యాట్స్మన్ అయిన మయాంక్ను పంజాబ్ కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది.
మహమ్మద్ షమీ..
పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోబోయే మూడో ప్లేయర్ మహమ్మద్ షమీ. టీమిండియా స్టార్ పేసర్ అయిన షమీని పంజాబ్ వదులుకునే సాహసం అయితే చేయదు. గత మూడు నాలుగేళ్లుగా షమీ అంతర్జాతీయ క్రికెట్లోనూ దుమ్మురేపుతున్నాడు. గాయాలతో సావాసం చేస్తూనే రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా షమీ సత్తా చాటుతున్నాడు. ఇప్పటి వరకు 73 మ్యాచ్లు ఆడిన షమీ.. 68 వికెట్లు తీసాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో షమీ అద్భుతంగా రాణించాడు. 2019లో 19 వికెట్లు తీసిన షమీ.. గత సీజన్లో 20 వికెట్లు పడగొట్టాడు. కరోనాతో ఆగిపోయిన ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన షమీ.. 8 వికెట్లు తీశాడు.
డేవిడ్ మలాన్..
ఇక ఓవర్సీస్ కోటాలో పంజాబ్ డేవిడ్ మలాన్ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ ఆడిన అనుభవం పెద్దగా లేకపోయినా.. అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ఉండటమే దీనికి కారణం. ఐపీఎల్ 2021 వేలంలో రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ అతన్ని వేలంలోకి విడిచి రిస్క్ చేయకపోవచ్చు. ఐపీఎల్ అనుభవం లేకపోయినా.. 27 అంతర్జాతీయ టీ20ల్లో 47.39 సగటుతో 1090 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 11 హాఫ్ సెంచరీలున్నాయి. ఒకవేల మలాన్ను వద్దనుకుంటే మాత్రం పూరన్ను తీసుకోవచ్చు.