ప్రతీ మ్యాచ్ కీలకమే..
'గ్రూప్ దశలో నాకు మంచి డ్రా ఎదురైంది. హాంకాంగ్ అమ్మాయి బాగా ఆడుతుంది. మ్యాచ్ కఠినంగా జరగనుంది. ఒలింపిక్స్లో అంతా మంచి ఫామ్లో ఉంటారు. నేనూ బాగానే ఆడతానని భావిస్తున్నా. ప్రతి మ్యాచూ కీలకమే. ఒక్కో మ్యాచ్ లక్ష్యంగా బరిలోకి దిగుతాను. ఒలింపిక్స్లో ప్రతి పాయింటు విలువైందే. ఒలింపిక్స్లో గెలవడమంటే అంత సులువైన పని కాదు' అని సింధు తెలిపింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధుకు గ్రూప్-జే లోని ఇద్దరిపై మెరుగైన రికార్డే ఉంది. చెంగ్తో ఐదుసార్లు, పొలికర్పోవాతో రెండుసార్లు తలపడగా అన్నింటా ఆమెదే విజయం. సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులకు అందుబాటులో ఉండే పీవీ సింధు.. తాజాగా షేర్ చాట్లోనూ ఖాతా తెరిచింది.
డబుల్స్ జోడీకి కఠిన డ్రా..
పురుషుల డబుల్స్లో భారత్కు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ ద్వయం ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో వీరిది పదో స్థానం. టోక్యో ఒలింపిక్స్లో ఈ ద్వయం గ్రూప్-ఏలో ఉంది. వీరికి కఠిన డ్రా ఎదురైంది. ప్రపంచ నంబర్ వన్ జోడీ కెవిన్ సంజయ, మార్కస్ ఫెర్నాల్డి గిడోన్ (ఇండోనేసియా), ప్రపంచ మూడో ర్యాంకు లీ యాంగ్, వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ)ని ఓడిస్తేనే వారు క్వార్టర్ ఫైనల్కు చేరుకుంటారు.
సాయశక్తులా ప్రయత్నిస్తా..
ఇక పురుషుల సింగిల్స్లో ప్రపంచ 15వ ర్యాంకర్ బి.సాయి ప్రణీత్ గ్రూప్-డిలో ఉన్నాడు. నెదర్లాండ్స్కు చెందిన మార్క్ కాల్జౌ (29వ ర్యాంకు), ఇజ్రాయెల్ షట్లర్ మిషా జిల్బెర్మన్ (47వ ర్యాంకు)తో తలపడనున్నాడు. తనకు మిశ్రమ డ్రా ఎదురైందని ప్రణీత్ అన్నాడు. మరీ తేలిక, మరీ కఠినమైంది కాదన్నాడు. అన్ని మ్యాచులు గెలిచేందుకు 100% ప్రయత్నిస్తానని వెల్లడించాడు.
24 నుంచి షురూ..
టోక్యో ఒలింపిక్స్లో ప్రతి సింగిల్స్ విభాగంలో 42 మంది తలపడుతున్నారు. వారిని 14 గ్రూపులుగా విభజించారు. ఒక్కో బృందంలో ముగ్గురు షట్లర్లు ఉంటారు. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన వారు నాకౌట్ పోరుకు అర్హత సాధిస్తారు. ఇక డబుల్స్లో 16 జోడీలను ఏ, బీ, సీ, డీ బృందాలుగా విభజించారు. ప్రతి గ్రూప్లో మూడు జంటలు ఉంటాయి. అగ్రస్థానంలో నిలిచిన తొలి రెండు జోడీలను క్వార్టర్స్కు ఎంపిక చేస్తారు. ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ పోటీలు జులై 24 నుంచి మొదలవ్వనున్నాయి. సింధుపైనే భారీ అంచనాలున్నాయి.