హైదరాబాద్: ఒలంపిక్స్లో గోల్డ్ కొట్టాలని ప్రతి ఒక్క అథ్లెట్ కల కంటాడు. అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు అందరూ ఏళ్ల తరబడి సాధన చేస్తుంటారు. తమ కలను నెరవేర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి.. ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. భారత్ నుంచి 100కి పైగా అథ్లెట్లు ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. అందులో తెలుగుతేజం పీవీ సింధు కూడా ఉంది.
2016 రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు రజతం అందుకుంది. స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ చేతిలో ఓడి తృటిలో గోల్డ్ మిస్ చేసుకుంది. అయితే ఈసారి మాత్రం తాను కచ్చితంగా గోల్డ్ సాధిస్తానని నమ్మకంగా చెబుతోంది సింధు. 2016 గేమ్స్ కంటే టోక్యో ఒలింపిక్స్ భిన్నంగా ఉంటాయని ప్రపంచ ఛాంపియన్ సింధు అభిప్రాయపడింది. అంచనాల ఒత్తిడిని ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. గాయం కారణంగా మారిన్ ఒలింపిక్స్కు దూరంగా ఉండడం కూడా సింధు ఫేవరేట్గా మారింది.
తాజాగా పీవీ సింధు మాట్లాడుతూ... 'ఏదైనా పెద్ద ఈవెంట్లో బరిలోకిదిగానంటే.. నేను పతకంతో తిరిగి వస్తాననే అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. అది అంత సులభం కాదు. ఆటపై దృష్టి పెట్టడం ద్వారా నేను దీనిని పరిష్కరించుకోవాలి. లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడాలి. ఈసారి నా లక్ష్యం గోల్డ్ సాధించడమే. కొరియన్ కోచ్ పార్క్ టే సాంగ్ ఆధ్వర్యంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నా. టోక్యోలోని బ్యాడ్మింటన్ వేదిక మాదిరిగానే ఉండే పరిస్థితులలో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నేను వేర్వేరు స్పారింగ్ భాగస్వాములతో శిక్షణ పొందుతున్నా. ఇక్కడ శిక్షణ పొందాలన్న నా అభ్యర్థనను వెంటనే అంగీకరించినందుకు మరియు నా శిక్షణ కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసినందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా' అని పేర్కొంది.
బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం దక్కనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. లింగ భేదం లేకుండా పురుషుల నుంచి ఒకరు, పురుషుల నుంచి మరొకర్ని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది.
చెలరేగిన వోక్స్.. 185 పరుగులకే లంక ఆలౌట్! ఐదుగురు ఆల్రౌండర్లతో బరిలోకి దిగినా నో యూజ్!!