బాలి (ఇండోనేసియా): వరల్డ్ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. సెమీఫైనల్ తడబాటు కొనసాగుతోంది. అక్టోబర్లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫలితాన్నే తాజా ఇండో నేసియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో పునరావృతం చేసింది. టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ సింధు కథ మళ్లీ సెమీఫైనల్లో ముగిసింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సిడ్ సింధు 21-15, 9-21, 14-21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను దక్కించుకున్నా సింధు సునాయసంగా మ్యాచ్ గెలుస్తుందనిపించింది. కానీ ఊహకందని విధంగా థాయ్లాండ్ ప్లేయర్ రెండో గేమ్ను గెలిచి షాకిచ్చింది. డిసైడర్ గేమ్లో కూడా దూకుడు కొనసాగించిన థాయ్ షట్లర్ మ్యాచ్ సొంతం చేసుకుంది. రాచోనక్తో చివరిగా ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సింధు ఓడిపోయింది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెల్చుకున్నాక సింధు ఆడిన నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేదు.
మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జంట కూడా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ప్రపంచ నంబర్వన్ జోడీ మార్కస్ గిడియోన్-కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ 16-21, 18-21తో ఓటమి పాలైంది. గిడియోన్-కెవిన్ ద్వయం చేతిలో సాత్విక్-చిరాగ్లకిది వరుసగా పదో పరాజయం కావడం గమనార్హం.
శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సింధు 14-21, 21-19, 21-14తో సిమ్ యుజిన్ (కొరియా)పై గెలుపొందింది. 66 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిపై సింధు పైచేయి సాధించి టైటిల్పై ఆశలు రేకెత్తించినప్పటికీ సెమీస్ గండాన్ని ధాటలేకపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో ఆరో సీడ్ సాత్విక్- చిరాగ్ 21-19, 21-19తో జో ఫెయ్- నూర్ ఐజుద్దీన్ (మలేసియా)పై నెగ్గారు. కానీ సెమీస్లో ఆ జోరును కొనసాగించలేకపోయారు.