హైదరాబాద్: ప్రపంచ నంబర్వన్, భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్కు ఫైనల్లో చుక్కెదురైంది. కామన్వెల్త్ గేమ్స్లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పోరులో ఓటమి చెందడంతో రజితంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మలేసియాకు చెందిన లీ చోంగ్ వీ 19-21, 21-14, 21-14 తేడాతో కిదాంబి శ్రీకాంత్పై విజయం సాధించి స్వర్ణం సాధించాడు.
తొలి గేమ్లో హోరాహోరీగా పోరాడి గెలిచినా.. తర్వాతి రెండు సెట్లలో లీ చోంగ్ ఆధిక్యం కనబరిచాడు. కిదాంబికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా... కళ్లు చెదిరే స్మాష్ షార్ట్లతో చోంగ్ విరుచుకుపడ్డాడు. దీంతో మ్యాచ్ లీ చోంగ్ వీ వశమైంది. తొలి గేమ్ కోల్పోయిన లీ చోంగ్ వీ ఆపై ఏ దశలోనూ శ్రీకాంత్కు అవకాశం ఇవ్వలేదు. అద్భుతమైన స్మాష్లతో వరుస పాయింట్లు నెగ్గడంతో శ్రీకాంత్ కాస్త ఒత్తిడికి లోనైనట్లు కనిపించాడు.
మూడో గేమ్లో సైతం లీ చోంగ్ వీ ఆదినుంచే పాయింట్లపై దృష్టిపెట్టి ఎదురుదాడి చేయడంతో గేమ్తో పాటు మ్యాచ్ కోల్పోయిన శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్స్లో లీ చోంగ్ వీ 21-16, 9-21, 21-14తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)ను ఓడించిన విషయం తెలిసిందే.
కామన్వెల్త్లో భారత్ పతకాల వేట ముగిసింది. పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా చూస్తే 26 స్వర్ణం, 20 రజతం, 20 కాంస్యాలతో 66 పతకాలను సాధించింది. 2014 కామన్వెల్త్తో పోలిస్తే... ఈసారి గోల్డ్ మెడల్స్ పెరిగాయి. ఇక పతకాల లిస్ట్లో మొదటి, రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు నిలిచాయి.