ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది. తమ చివరి ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 7 పరాజయాలను మూటగట్టుకుంది.
ముంబై ఇండియన్స్ ప్రధాన ఆటగాళ్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మల వైఫల్యం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ 9 మ్యాచ్ల్లో బుమ్రా 3 వికెట్లే తీయగా.. సూర్యకుమార్ యాదవ్ 20 సగటు, తిలక్ వర్మ 24 సగటుతో పరుగులు చేశారు.

అయితే ఈ ముంబై ఇండియన్స్ త్రిమూర్తలకు ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనే అండగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనకు ఈ ముగ్గుర్ని నిందించలేమని స్పష్టం చేశాడు. ఫామ్ టెంపరరీ అని, క్లాస్ పర్మినెంట్ అని వెనకేసుకొచ్చాడు. ఒకటి, రెండు ఇన్నింగ్స్లు ఆడితే మళ్లీ టచ్లోకి వస్తారని చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు ఈ ముగ్గురు ఆటగాళ్లు విఫలమయ్యారని వెల్లడించాడు.

'సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయాడని నేను అనుకోను. కొన్ని మంచి స్కోర్లు సాధిస్తే అతనికి ఆ లయ దొరుకుతుంది. ఈరోజు(సీఎస్కేతో) అతను బాగా ఆడాడు. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరో రెండు ఓవర్లు ఆడి ఉంటే మంచి స్కోర్ చేసేవాడు. కానీ కొన్నిసార్లు అనుకున్నవి జరగవు. అతను ఆడింది చాలా మంచి షాట్ అని అనుకున్నాను. కానీ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. సూర్య ఫామ్లోనే ఉన్నాడు. ఈ సీజన్లో అతను బౌండరీపై చాలా సార్లు ఔటయ్యాడు. అతనికి కలిసి రాలేదు అంతే. అతను నిరాశచెంది ఉంటాడు. కానీ కష్టపడాలి.’అని సూర్య వైఫల్యాన్ని జయవర్దనే విశ్లేషించాడు.
తిలక్ వర్మ టీ20 ఫార్మాట్లో తన ఆట తీరును మెరుగుపరుచుకుంటున్నాడని జయవర్దనే చెప్పుకొచ్చాడు. విభిన్న పరిస్థితుల్లో అతను రాణించే విషయంపై ఆందోళను ఉన్నప్పటికీ.. అనుభవంతోనే ఆ బలహీనతను అధిగమించగలడని జయవర్దనే విశ్వాసం వ్యక్తం చేశాడు.
'తిలక్ వర్మ కూడా ఇంకా నేర్చుకుంటున్నాడు. విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. టీ20 క్రికెట్ అంత ఈజీ కాదు, అతను ఎంత ఎక్కువ విభిన్న పరిస్థితుల్లో ఆడితే.. ఏమి చేయాలో అర్థం చేసుకుంటాడు. పరిస్థితులను ఎదుర్కోవడం, ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో ఆలోచించడంతో పాటు మరింత చురుకుగా ఉండటం వంటి విషయాలను అతను నేర్చుకుంటాడు.’ అని జయవర్దనే చెప్పుకొచ్చాడు.
బుమ్రా వికెట్లు తీయకపోవడానికి అతని వైఫల్యమే కారణంగా కాదని, టీమ్ బౌలింగ్ సమష్టిలోపమని జయవర్దనే అభిప్రాయపడ్డాడు. 'ఇది కేవలం బుమ్రా ఒక్కడి సమస్యే కాదు. బౌలర్లందరి సమష్టి వైఫల్యం. అందరూ మెరుగ్గా రాణించి వికెట్లు తీసి ఉంటే.. బుమ్రా కూడా మరింత దూకుడుగా బౌలింగ్ చేసేవాడు. కేవలం బంతిని కట్టడి చేయడం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరికీ ఒక నిదానమైన సీజన్ ఉంటుంది, కానీ క్లాస్ ఎల్లప్పుడూ శాశ్వతం’ అని జయవర్దనే స్పష్టం చేశాడు.
