హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరమైంది. కుడి మోకాలికి గాయం కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు నెలలుగా కుడి మోకాలి గాయంతో సానియా మిర్జా బాధపడుతోన్న సంగతి తెలిసిందే.
మోకాలి గాయం తగ్గకపోవడంతో ఆపరేషన్ అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో ఆమె త్వరలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనుంది. శనివారం కోల్కతాలోని ప్రేమ్జిత్ లాల్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ ఫైనల్కు మాజీ ఆటగాడు విజయ్ అమృతరాజ్ తో కలిసి సానియా మిర్జా హాజరైంది.
ఈ సందర్భంగా సానిమా మాట్లాడుతూ 'మోకాలి గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. నడవడానికి ఇబ్బందేమీ లేదు కానీ కోర్టులో అటు ఇటు పరుగెత్తుతూ ఆడడమంటే కష్టం. కనీసం రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడు సూచించాడు. గాయం నయం కావడానికి ఇంజెక్షన్లు సరిపోతాయా లేదా శస్త్ర చికిత్స అవసరమా అనేది మున్ముందు తెలుస్తుంది. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరమయ్యాను' అని సానియా చెప్పింది.
'15 ఏళ్ల తర్వాత, కొన్ని నెలలు ఆటకు దూరమవడం పెద్ద విషయమేమీ కాదు. ఫెదరర్ ఆరునెలల విశ్రాంతి తర్వాత ఆడుతూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతాలు చేస్తున్నాడు. నా విషయంలోనూ అలాగే జరుగుతుందని విశ్వసిస్తున్నా' అని సానియా మిర్జా చెప్పుకొచ్చింది.
2016లో మార్టినా హింగిస్తో కలిసి సానియా ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జోడీలపై కూడా సానియా మిర్జా స్పందించింది.
Thanks @MirzaSania for coming to the @FanatticSMuseum always a pleasure to host you and Imranbhai. Good to catch up. pic.twitter.com/hLkfcZHP74
— Boria Majumdar (@BoriaMajumdar) December 16, 2017
'భారత్లో మీడియా ప్రచారం ఎలా ఉంటుందో వాళ్లకు అర్థమైంది. అందుకే ఇటలీకి వెళ్లారు. ఏదో ఒక సమయంలో వాళ్లు దాన్ని ఎదుర్కోవాల్సిందే. నాకు మీడియా అతి ప్రచారం ఇష్టం ఉండదు. పెళ్లి అనేది ఎలాగూ ఒత్తిడికి గురిచేస్తుంది. నా చెల్లికి పెళ్లైంది. ఆ పెళ్లి అంత ప్రముఖమైందేమీ కాదు. అయినా ఒత్తిడి తప్పలేదు' అని సానియా చెప్పడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.