
హైదరాబాద్: 'అబ్బబ్బ.. ఈ న్యూస్ ఛానెళ్లు తలనొప్పి తెప్పించేస్తున్నాయ్..' అంటోంది సానియా మీర్జా. ప్రస్తుతం గర్భిణీగా మాతృత్వం గురించి కలల కంటోన్న ఈ హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ న్యూస్ ఛానెళ్లపై అసహనం వ్యక్తం చేశారు. కొన్ని టీవీ ఛానెళ్లలో వార్తలు చూడాలంటే భయమేస్తోందని.. అవి తలపోటు వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఓ మహిళపై లేదా బాలికపై అత్యాచారం జరిగిన వార్త వినని రోజు ఉండటం లేదని సానియా ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనిగా న్యూస్ ఛానెళ్ల తీరు పైనా అసహనం వ్యక్తం చేశారు. అదే పనిగా రేప్ వార్తలు చూస్తుంటే.. కుంగుబాటుకు గురవుతున్నానని సానియా ట్వీట్ చేశారు. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయని, ఇలాంటి వార్తలు చూస్తుంటే భయమేస్తోందని సానియా పేర్కొన్నారు. దీనికి తోడు కొన్ని వార్తా ఛానెళ్లు అదే పనిగా ప్రసారం చేస్తుండటం కుంగుబాటుకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
'చాలా కాలం తర్వాత.. కొన్ని నెలల తర్వాత (ఎందుకు అని మాత్రం అడగొద్దు ఇవాళ నేను కొన్ని టీవీ ఛానెళ్లు చూశా. నేను చూసినంత సేపు టీవీలో 12 మంది వ్యక్తులు కనిపించారు. వారు రిపోర్టింగ్గానీ, మాట్లాడటం గానీ ఏం చేయడం లేదు. గందరగోళంగా అరుస్తూ ఏదో చెబుతున్నారు. స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తుంటే బాధేస్తోంది. దీంతో నాకు తలనొప్పి వచ్చింది. మళ్లీ కొన్ని నెలల తర్వాతే న్యూస్ ఛానెళ్లు చూస్తా..' అని సానియా ట్వీట్ చేశారు.
సానియా మీర్జా టీవీ ఛానెళ్లను చాలా రోజుల తర్వాత చూసింది. మళ్లీ చాలా రోజుల తర్వాత చూస్తానంటోంది. అలాంటప్పుడూ ప్రతిరోజూ అదే రకం వార్తలు ప్రసారమవుతున్నాయని ఎలా చెప్పగలిగిందోనని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహమాడిన సానియా.. అక్టోబరులో ఆమె శిశువుకు జన్మనివ్వనుంది. అందుకోసం ఆమె కొన్ని నెలలుగా ఆటకు విరామం తీసుకుంది. తన భర్త, తనకు చెందిన కుటుంబ వారసత్వాలు అందిచ్చేలా ఇరు వంశాల పేరు పెడతామని ఆమె ఇదివరకే చెప్పారు.