సిట్సిపాస్ ఔట్..
పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా... ప్రత్యర్థి విజయం అంచుల్లో ఉన్నా... చివరి పాయింట్ను కూడా సులువుగా ఇవ్వకూడదని పట్టుదల కనబరిచిన క్రొయేషియా యువతార బొర్నా చోరిచ్ చివరకు తన కెరీర్లోనే అద్భుత విజయం సాధించాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో 23 ఏళ్ల చోరిచ్ ఓటమి బాట నుంచి గెలుపు బాట పట్టి విజయకేతనం ఎగురవేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్, నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ చోరిచ్ 6-7 (2/7), 6-4, 4-6, 7-5, 7-6 (7/4)తో గెలుపొందాడు.
మ్యాచ్కు ముందు హైడ్రామా
అమెరికా సమయం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఐదోసీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మన్నారినో (ఫ్రాన్స్) మధ్య జరగాల్సిన మ్యాచ్ ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కరోనాతో టోర్నీ నుంచి వైదొలిగిన బెనోయిట్ పెయిర్తో మన్నారినో కాంటాక్ట్ అయ్యాడని, అతడు క్వారంటైన్లో ఉండాలని న్యూయార్క్ స్టేట్ హెల్త్ అధికారులు టోర్నీ నిర్వాహకులకు తేల్చి చెప్పారు. దీంతో ఈ మ్యాచ్పై సందేహాలు నెలకొన్నా.. తీవ్ర చర్చల అనంతరం సమస్య పరిష్కారమైంది.. మ్యాచ్లో అతను ఆడాడు. ఈ మ్యాచ్లో జ్వెరెవ్ 6-7, 6-4, 6-2, 6-2తో నెగ్గాడు.
క్విటోవా, కెర్బర్, ఒసాక ముందంజ..
మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ నవోమి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మూడో రౌండ్లో ఒసాకా 2 గంటల 33 నిమిషాలు పోరాడి 6-3, 6-7 (4/7), 6-2తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)ను ఓడించగా... క్విటోవా 6-4, 6-3తో జెస్సికా (అమెరికా)పై, కెర్బర్ 6-3, 6-4తో యాన్ లీ (అమెరికా)పై నెగ్గారు. 14వ సీడ్ కొంటావె (ఎస్తోనియా) 6-3, 6-2తో మాగ్దా లినెట్టి (పోలాండ్)పై, 15వ సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6-3, 6-1తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచారు.
బోపన్న జోడీ శుభారంభం..
పురుషుల డబుల్స్లో భారత్కు చెందిన రోహన్ బోపన్న-డెనిస్ షపోవలోవ్ (కెనడా) ద్వయం 6-2, 6-4తో ఎస్కోబెడో-రుబిన్ (అమెరికా) జంటపై గెలిచి రెండో రౌండ్లో ప్రవేశించింది. సుమిత్ నగాల్, దివిజ్ శరణ్ల నిష్క్రమణతో భారత్ నుంచి టోర్నీలో బోపన్న మాత్రమే మిగిలాడు.