హైదరాబాద్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ వంద టైటిళ్లకు చేరువయ్యాడు. మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాక బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే రోజర్ ఫెదరర్ టైటిల్ సాధించాడు. దీంతో కెరీర్లో 98వ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం ముగిసిన మెర్సిడెస్ ఓపెన్లో ఫెదరర్ టైటిల్ విజేతగా నిలిచాడు.
ఆదివారం 78 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ రోజర్ ఫెదరర్ 6-4, 7-6 (7-3)తో ఆరో సీడ్ మిలోస్ రోనిచ్ (కెనడా)పై గెలుపొందాడు. రోనిచ్తో 14 మ్యాచ్లు ఆడిన ఫెదరర్కు ఇది 11వ విజయం. ఇక, గ్రాస్ కోర్టులపై 28వది. తాజా విజయంతో ఫెదరర్ నంబర్వన్ ర్యాంకును కూడా సొంతం చేసుకున్నాడు.
First 🏆 in Stuttgart!@rogerfederer defeats Milos Raonic 6-4 7-6(3).#MercedesCup pic.twitter.com/7Dpfi7azEa
— Tennis TV (@TennisTV) June 17, 2018
ఈ టోర్నీలో రోజర్ ఫెదరర్ విజయం సాధించడంతో 1,17,030 యూరోల (రూ. 92 లక్షల 43 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు, మెర్సిడెస్ కారు లభించింది. ఈ టోర్నీలో ఫైనల్ చేరడంద్వారా సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్లో 36 ఏళ్ల ఫెడరర్ మళ్లీ నంబర్వన్ ర్యాంక్ సొంతం చేసుకోనున్నాడు.
మ్యాచ్ అనంతరం రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ "ఇది ఘనమైన పునరాగమనం. మూడో ప్రయత్నంలో నేను ఈ టైటిల్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరోసారి టాప్ ర్యాంక్ నాలో కొత్త ఉత్సాహం నింపుతుందో లేదో వేచి చూడాలి" అని ఫెదరర్ అన్నాడు. తన కెరీర్ మొత్తంలో 148 ఫైనల్స్ ఆడిన ఫెదరర్ 98 ఫైనల్స్లో విజేతగా నిలవగా, మరో 50 ఫైనల్స్లో ఓడిపోయాడు.
1998లో ప్రొఫెషనల్గా టెన్నిస్ ప్లేయర్గా మారిన తర్వాత రోజర్ ఫెదరర్ అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అమెరికాకు చెందిన జిమ్మీ కానర్స్ 109 టైటిళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.