న్యూయార్క్: ప్రమాదకర మహమ్మారి కరోనా వైరస్కారణంగా అగ్రరాజ్యం అమెరికాకు కంటిపై కునుకు లేకుండా పోతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్ననేపథ్యంలో.. అమెరికాలోని ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీకి వేదికైన బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ కోర్టును తాత్కాలిక ఆసుపత్రిగా మార్చబోతున్నారు.
స్టార్ క్రికెటర్ కార్లో దొంగతనం.. క్రెడిట్కార్డు స్వాహా!!
ప్రతియేటా ఆఖరి గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్కు వేదికయ్యే యూఎస్ ఓపెన్ ఎరీనా ఇప్పుడు కరోనా ఆసుపత్రిగా మారనుంది. న్యూయార్క్ సిటీలోని యూఎస్ ఓపెన్ స్టేడియం ఇండోర్ సౌకర్యాలను 350 పడకల ఆసుపత్రిగా మార్చాలని అక్కడి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఆఫీస్ నిర్ణయించింది. న్యూయార్క్లో పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
వైద్య అవసరాల కోసం ఈ స్టేడియం బాగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఇందులో రోజూ డాక్టర్లు, ఇతర సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 25 వేల మందికి భోజనాలు పెడతారు. న్యూయార్క్ నగరంలో బిల్లీ జీన్ కింగ్ స్టేడియం మాత్రమే కాదు పలు ప్రముఖ ప్రాంతాలను దవాఖానలుగా మార్చుతున్నారు. ఇదిలా ఉంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్య వైఖరితో కరోనా వైరస్తో ఇప్పటికే 3,017 మంది చనిపోగా.. లక్షా 63 వేల మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
కరోనా మహమ్మారితో ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. యూఎస్ ఓపెన్ షెడ్యూల్ కూడా మారనుంది. యూఎస్ ఓపెన్ ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 13 వరకు జరగాలి. అయితే మార్పు తేదీలను నిర్వాహకులు త్వరలోనే ప్రకటించే అవకాశముంది.