హైదరాబాద్: 'నన్ను క్షమించండి. విజయంతో ముగించలేకపోయాను. కానీ మీ అభిమానానికి కృతజ్ఞతలు' అని తన ఆఖరి రేసు ముగిసిన అనంతరం జమైకా పరుగుల చిరుత ఉసేన్ బౌల్ట్ చెప్పిన మాటలివి. లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఉసేన్ బోల్ట్ చివరి 100 మీటర్ల రేసులో తొలిసారి కాంస్యానికే పరిమితమైన సంగతి తెలిసిందే.
ఈ ఓటమి అనంతరం ఉసేన్ బోల్ట్ మాట్లాడుతూ 'ఎలాంటి బాధా లేదు. ఇక్కడికి వచ్చి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఇక్కడ గెలిచినా, ఓడినా ఫలితంతో సంబంధం లేకుండా ఆట ముగించాలని ముందే నిర్ణయించుకున్నాను. నా కెరీర్పై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. నా కోసం ఈ ఆట కోసం నేనేం చేయాలో అంతా చేశాను. ఇక నిష్క్రమించాల్సిన సమయం వచ్చింది' అని అన్నాడు.
'ఒక పోరాట యోధుడి (గాట్లిన్) చేతిలో, మంచి భవిష్యత్తు ఉన్న మరో ప్రతిభావంతుడి (కోల్మన్) చేతిలో ఇక్కడ ఓడిపోయాను. ఈ సీజన్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆలోచించకుండా అభిమానుల కోసమే బరిలోకి దిగాను. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి కొంత నిరాశ ఉండటం సహజం. ఓడిపోతే ఎవరూ సంతోషించరు కదా. కానీ నా అత్యుత్తమ ఆట కనబర్చానని నాకు బాగా తెలుసు' అని బోల్ట్ చెప్పాడు.
'మంచి ఆరంభం లభించకపోవడంతో నేను గెలవడం కష్టమని అర్థమైపోయింది. గాట్లిన్ ఎన్నో సంవత్సరాలుగా కఠినంగా శ్రమించాడు. అతనికి గెలిచే అర్హత ఉంది. ఒక వ్యక్తిగా, పోటీదారుడిగా కూడా నేను అతడిని ఎంతో గౌరవిస్తాను' అని బోల్ట్ పేర్కొన్నాడు. ఒక్క ఓటమితో తన ప్రతిష్ట దిగజారదని బోల్ట్ చెప్పడం విశేషం.
దాదాపు దశాబ్ద కాలంగా 100 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బోల్ట్ చివరి రేసులో కాంస్యంతో సరిపెట్టుకోవడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది. అయితే ఉసేన్ బోల్ట్ ఒక్కడి విషయంలోనే ఇలా జరగలేదు. గతంలో క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ తన ఆఖరి ఇన్నింగ్స్లో డకౌట్ కాగా, బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ తన చివరి రెండు బౌట్లలో చిత్తయ్యాడు.