బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా 34 లక్షలమంది ప్రాణాలను హరించివేసిన భయానక కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాను అమెరికా డిప్లొమేటిక్గా దెబ్బకొడుతోంది. డ్రాగన్ కంట్రీలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందంటూ ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన అగ్రరాజ్యం..కార్యాచరణలోకి దిగింది. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ (2022 Winter Olympics)ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. అన్ని దేశాలు మూకుమ్మడిగా వింటర్ ఒలింపిక్స్ను బాయ్కాట్ చేయాలని కోరింది.
అదే జరిగితే ఈ మెగా ఈవెంట్ను చైనా నిర్వహించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. వింటర్ ఒలింపిక్స్ వచ్చే ఏడాది చైనాలో నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరి 4వ తేదీన ఇది ఆరంభం కావాల్సి ఉంది. రాజధాని బీజింగ్ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. కరోనా వైరస్ తీవ్రత దాదాపు తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో చైనా.. వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేపట్టింది. తాజాగా అమెరికా దీన్ని టార్గెట్గా చేసుకుంది. వింటర్ ఒలింపిక్స్ను బహిష్కరించడం ద్వారా ప్రపంచ దేశాలన్నీ చైనాను వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని బలంగా చాటిచెప్పినట్టవుతుందని అమెరికా భావిస్తోంది.
డిప్లొమేటిక్ బాయ్కాట్ చేయడం ద్వారా చైనా తీరును వ్యతిరేకించాలని యూఎస్ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసి అన్నారు. చైనాలోని గ్ఝిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉయ్ఘుర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం దమనకాండను సాగిస్తోందని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందంటూ అమెరికా చాలా కాలం నుంచీ చెబుతూ వస్తోంది. చైనా నిర్వహించే వింటర్ ఒలిపింక్స్కు అన్ని దేశాలు హాజరైతే.. ఆ దేశంలో అన్నీ సవ్యంగానే ఉందనే సంకేతాలను ఇచ్చినట్టవుతుందని, ఇది ఎంత మాత్రం సరికాదని పెలోసి అన్నారు.
చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని గుర్తు చేశారు. వింటర్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి అథ్లెట్లకు అభ్యంతరం చెప్పని దేశాలు.. ప్రభుత్వ తరఫు అధికారులు, రాయబారులు, హైకమిషనర్లను గానీ ఆ మెగా ఈవెంట్కు పంపించకూడదని ఆమె సూచించారు. వింటర్ ఒలింపిక్స్కు హాజరయ్యే దేశాలు.. భవిష్యత్తులో మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హతను కోల్పోయినట్టవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.