టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్ పతకాల పంట కొనసాగుతోంది. శనివారం జరిగిన బ్యాడ్మింటన్ ఫైనల్స్లో ప్రమోద్ భగత్ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్స్లో గ్రేట్ బ్రిటన్కు చెందిన డేనియల్ బెతెల్పై 21-14.21-17 తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ను దేశానికి అందించాడు. దీంతో భారత్ ఖాతాలో మొత్తం 4 బంగారు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్ మ్యాచ్ మొత్తం 45 నిమిషాల పాటు సాగింది. తొలి గేమ్ను 21 నిమిషాల్లో పూర్తికాగా రెండో గేమ్ 24 నిమిషాల్లో భగత్ పూర్తి చేశాడు. ఇప్పటికే షూటర్లు అవని లేఖరా, మనీష్ నార్వాల్లు స్వర్ణం సాధించగా జావెలిన్ త్రోలో సుమిత్ గోల్డ్ మెడల్ సాధించాడు.
ఇక బ్యాడ్మింటన్ ఫైనల్స్ హోరాహోరీగా సాగింది. ప్రమోద్ భగత్ నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ.. ఆట కొనసాగే క్రమంలో దూకుడును ప్రదర్శించాడు. క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించిన ప్రమోద్ భగత్.. డిఫెన్స్ చక్కగా ఆడి బేతెల్ పై పైచేయి సాధించాడు. ఇక బేతెల్ ప్రమోద్ భగత్ సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలోనే డ్రాప్ షాట్లు, స్మాష్లతో రెచ్చిపోయాడు. అయితే భగత్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కేవలం డిఫెన్స్తోనే కాకుండా తన ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు ప్రమోద్. దీంతో తొలిగేమ్ను 21-14తో పూర్తిచేశాడు.
#IND's National Anthem playing again today at the Pramod Bhagat's Victory Ceremony at #Tokyo2020 #Paralympics Games!#TeamIndia | #Cheer4India | #Praise4Para pic.twitter.com/rOX6uOgoit
— Doordarshan Sports (@ddsportschannel) September 4, 2021
ఇక రెండో గేమ్లో బెతెల్ అటాకింగ్ గేమ్ ఆడటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో 8 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. ఇక మూడో గేమ్లో ఫలితం తేలుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రమోద్ భగత్ అద్భుతమైన ఆటతీరును కనబర్చి బెతెల్ పై పట్టుసాధించాడు. ముందుగా పాయింట్లను సమం చేసిన భగత్ ఆ తర్వాత వెనుదిరగలేదు. ముందుకు చొచ్చుకెళ్లి రెండో గేమ్ను సొంతం చేసుకున్నాడు. ఇక కోర్టు నెంబర్ 3లో జపాన్కు చెందిన డైసుకే ఫుజిహారాపై భారత్కు చెందిన మనోజ్ సర్కార్ 22-20, 21-13తో విజయం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ మొత్తం 47 నిమిషాల పాటు జరిగింది. మనోజ్ సర్కార్ కాంస్య పతకం కైవసం చేసుకోవడం ద్వారా ఒకే రోజు బ్యాడ్మింటన్లో రెండు పతకాలు సాధించినట్లయ్యింది.