టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్ 2021 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. ఖచ్చితంగా గెలిచి తీరుతామనుకునే ఈవెంట్లలో స్టార్ అథ్లెట్లు సైతం పరాజయం పాలవుతోన్నారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన వారు పతకం దిశగా దూసుకెళ్తోన్నారు. మహిళల ప్రపంచ ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన ఆష్ బార్టీ..టోక్యో ఒలింపిక్స్లో తొలి రౌండ్లోనే తిరుగుముఖం పట్టడం సంచలనం రేపింది. ఏ మాత్రం ఊహించని ఓటమి ఆమెది. వరల్డ్ నంబర్ వన్ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ తొలి రౌండ్లో పరాజయం కావడం సంచలనం రేపింది.
అర్ధాంతరంగా తప్పుకొన్న టెన్నిస్ స్టార్: గోల్డెన్ ఛాన్స్ మిస్: రీప్లేస్ చేస్తామంటూ
మహిళల టెన్నిస్ డబుల్స్లో భారత ప్లేయర్లు సానియా మీర్జా-అంకితా రైనా తొలి రౌండ్లో ఓడిపోవడం కూడా ఇలాంటిదే. అదే సమయంలో లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్లో భారత రోయర్లు సెమీ ఫైనల్ చేరడం ఓ అద్భుతం. సెమీస్లో విజయం సాధించగలిగితే పతకం ఖాయమైనట్టే. ఇలాంటి పరిణామాల మధ్య జపాన్ లోకల్ స్టార్ నవొమి ఒసాకా.. అంచనాలకు తగ్గట్టుగా రాణించారు. టోక్యో ఒలింపిక్స్లో తాను ఎదుర్కొన్న తొలి రౌండ్ మ్యాచ్లో అద్భుతంగా ఆడారు. ప్రత్యర్థిని చిత్తు చేశారు. రెండో రౌండ్లో ప్రవేశించారు. తన హోమ్ గ్రౌండ్లో ఆమె చెలరేగిపోయారు.
చైనాకు చెందిన సైసై ఝెంగ్పై నవొమి ఒసాకా 6-1, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. గంటా 27 నిమిషాల పాటు ఈ సాగిన ఈ మ్యాచ్ను కైవసం చేసుకోవడానికి నవొమి పెద్దగా కష్ట పడాల్సిన అవసరం రాలేదు. తొలి సెట్లోను వార్ వన్సైడ్గా మార్చివేశారు. అలవోకగా నెగ్గుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక మ్యాచ్లను ఆడిన అనుభవం ఉన్న ఒసాకా ముందు సైసై ఝెంగ్ నిలవలేకపోయారు. సై అనలేకపోయారు. ఒసాకా ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, హాప్ వ్యాలీ షాట్లకు చైనా ప్లేయర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.
రెండో సెట్లో ఝెంగ్ పుంజుకున్నప్పటికీ.. ఒసాకా ధాటిని ధీటుగా ఎదుర్కొనలేకపోయారు. రెండో సెట్లో 4-6తో కోల్పోయారు. వరుస సెట్లలో విజయం సాధించడం ద్వారా నవొమి ఒసాకా.. తన ప్రత్యర్థులకు హెచ్చరికలను పంపారు. వింబుల్డన్ టోర్నమెంట్లో విలేకరుల సమావేశాన్ని బహిష్కరించి, తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ఒసాకా.. జెట్ స్పీడ్తో తేరుకున్నారు. మానసిక ఒత్తిడి, అలసటకు గురి కావడం వల్ల వింబుల్డన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన ఆమె.. తన జోరును చూపించారు. పతకాల వేటలో గ్రాండ్గా ముందడుగు వేశారు.