స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు
భారత్లోని వివిధ రాష్ట్రాల నుంచి 119 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొంటున్నారు. ఎన్ని పతకాలు వస్తాయనేది ఇప్పుడే చెప్పలేం. అయితే పతకాలు తెస్తే నగదు బహుమతులిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్వర్ణ పతకం గెలిస్తే రూ.75 లక్షలు, రజతం గెలిస్తే రూ.50 లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.30 లక్షలు ఇస్తామని పేర్కొంది. మరోవైపు తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్కు వెళ్లిన అథ్లెట్లు స్వర్ణ పతకం తెస్తే రూ.6 కోట్లు, రజతం తెస్తే రూ.4 కోట్లు, కాంస్యం తెస్తే రూ.2-2.5 కోట్లు అందజేస్తామని హరియాణా, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్ఘడ్, ఛండీగఢ్ ప్రకటించాయి.
మొదటగా తమిళనాడు ప్రభుత్వం
కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు స్వర్ణ పతక విజేతలకు రూ.5 కోట్లు చొప్పున ఇవ్వనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం బంగారు పతకాలు తెచ్చిన వారికి రూ.3 కోట్లు ఇవ్వనుంది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మొదటగా ప్రకటించారు.
బంగారు పతకం సాధించిన వారికి రూ.6 కోట్లు, రజతం సాధిస్తే రూ.4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు. ఆ తర్వాత అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహకాలు ప్రకటించాయి. ఇతర దేశాలతో పోలిస్తే పతకాలు గెలిచే అథ్లెట్లకు ఇచ్చే నగదు బహుమతి భారత్లోనే అత్యధికంగా ఉండటం విశేషం.
IND vs SL: పటిష్ట పాకిస్తాన్ను భారత్-బీ జట్టు కచ్చితంగా ఓడిస్తుంది: పాక్ మాజీ క్రికెటర్
అగ్రరాజ్యం నజరానా చాలా తక్కువ
ఇతర దేశాల విషయానికొస్తే.. బంగారు పతకం గెలిచిన క్రీడాకారులకు ఇండోనేషియా 7,46,000 డాలర్లు (రూ.5.55కోట్లు), సింగపూర్ 735,000 డాలర్లు (రూ.5.47 కోట్లు), హాంకాంగ్ 644,000 డాలర్లు (రూ.4.80కోట్లు), థాయ్లాండ్ 309,000 డాలర్లు (2.30కోట్లు), కజకిస్థాన్ 250,000 డాలర్లు (రూ.1.86కోట్లు), ఇటలీ 212,000 డాలర్లు (1.58కోట్లు) నగదు బహుమతి ప్రకటించాయి. అగ్రరాజ్యం అమెరికా పతకాలు తెచ్చేవారికి ఇచ్చే నజరానా చాలా తక్కువగా ఉండడం విశేషం. స్వర్ణం గెలిచే అమెరికన్ అథ్లెట్కు 37,500 డాలర్లు (రూ.28లక్షలు) ప్రకటించగా.. ఆతిథ్య దేశం జపాన్ 45,200 డాలర్లు (రూ.34లక్షలు) ఇవ్వనుంది.
క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్ నమ్మకం
ఫ్రాన్స్ 65,000 డాలర్లు (రూ.48లక్షలు), రష్యా 61,000 డాలర్లు (రూ.45లక్షలు), బ్రెజిల్ 47,500 డాలర్లు (రూ.35లక్షలు), దక్షిణాఫ్రికా 37,000 (రూ.27.5లక్షలు) నెదర్లాండ్స్ 35,400 డాలర్లు (రూ.26లక్షలు), జర్మనీ 22,000 డాలర్లు (రూ.16లక్షలు), కెనడా 16,000 డాలర్లు (రూ.12లక్షలు), ఆస్ట్రేలియా 15,100 డాలర్లు (రూ.11లక్షలు) నజరానాగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించాయి.
బ్రిటన్, నార్వే, స్వీడన్ దేశాలు మాత్రం అథ్లెట్లకు ఎలాంటి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. అందుకు బదులుగా ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ క్రీడల కోసం ఏటా 160 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నాయి. ఈ డబ్బుతో అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్ ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అథ్లెట్లలో క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్ నమ్మకం.