టోక్యో: ఇప్పటి వరకు కనిపించని కరోనా మహమ్మారి ఎంతో నష్టం చేకూర్చింది. ఫలానా రంగం అని చెప్పేందుకు లేదు. అన్ని రంగాలపై ఈ మాయదారి మహమ్మారి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. క్రీడా రంగంపై కూడా పంజా విసిరింది. దీంతో మెగా టోర్నీలు సైతం తుడుచుకుపెట్టుకుపోయాయి. తాజాగా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ మెగా గేమ్స్పై కూడా ఈ కనిపించని వైరస్ కాటేసింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విలేజ్లో నిర్థారిత కరోనావైరస్ పాజిటివ్ కేసు వెలుగు చూసింది. దీంతో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యమవుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తాయి.
ఒలింపిక్ అథ్లెట్స్ విలేజ్లో విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు టోక్యో ఒలింపిక్స్ 2020 సీఈఓ తొషీరో ముటో చెప్పారు. ఈ వ్యక్తి గేమ్స్ ఆర్గనైజింగ్లో సభ్యుడిగా ఉన్నట్లు సీఈఓ స్పష్టం చేశారు. ఇక కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే ఆ వ్యక్తిని అథ్లెట్స్ విలేజ్ నుంచి దూరంగా ఐసొలేషన్లో ఉంచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుతం ఓ హోటల్లో ఆ వ్యక్తిని ఉంచినట్లు వెల్లడించారు. ఇక కరోనా సోకకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు చీఫ్ ఆర్గనైజర్ సీకో హషిమోటో. ఒకవేళ కోవిడ్ విజృంభిస్తే మరో ప్లాన్ను సిద్ధం చేసి ఉంచామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పుడిప్పుడే అథ్లెట్లు ఒలింపిక్ విలేజ్కు చేరుకుంటున్నారు. జూలై 23 నుంచి ఆగష్టు 8వ తేదీ వరకు ఒలింపిక్స్ జరుగుతాయి. ఇదిలా ఉంటే విదేశాల నుంచి వస్తున్న క్రీడాకారులు, ఇతర నిర్వాహకులతో ఒలింపిక్స్ గేమ్స్ ఒక సూపర్ స్ప్రెడర్గా అవతరించే అవకాశం ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఏడాది పాటు ఈ మెగా గేమ్స్ వాయిదాపడ్డాయి.