ఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ 2020 నుంచి తిరిగి వచ్చిన వినేశ్పై క్రమశిక్షణ చర్యల కింద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వినేశ్.. మళ్లీ రెజ్లింగ్ ఆడతానో లేదో తెలియదని పేర్కొంది. గాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం అందరిలోనూ ఆసక్తి కలిగించింది.
వినేశ్ ఫొగాట్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'భారత్లో ఎంత త్వరగా పైకి లేస్తామో.. అంతే త్వరగా కిందపడిపోతాం. ఒక్క పతకం సాధించలేకపోయా. ఇప్పుడు అంతా అయిపోయింది. మళ్లీ రెజ్లింగ్ మ్యాట్పైకి ఎప్పుడు వెళతానో తెలియదు. విరిగిన కాలు బాగుందనే అనుకుంటున్నా. ఇప్పుడు నా శరీర భాగం విరగలేదు.. కానీ నా మనసు ముక్కలైపోయింది' అని ఆవేదన వ్యక్తం చేసింది. 2017 కంకషన్కు గురికావడం, అనంతరం రెండు సార్లు కరోనా సోకడం టోక్యో 2020లో తన ప్రదర్శనను ప్రభావితం చేశాయని వినేశ్ చెప్పింది.
2016 రియో ఒలింపిక్స్ ప్రత్యర్థితో పోటీ పడుతుండగా వినేశ్ ఫొగాట్ మోకాలికి గాయమైంది. దీంతో ఆమె రియో పోటీల నుంచి తప్పుకుంది. అయితే ఆ గాయం నుంచి కోలుకున్న వినేశ్.. టోక్యో ఒలింపిక్స్లో (53 కేజీల విభాగంలో) ఫేవరెట్గా బరిలోకి దిగింది. వినేష్ పతకం సాధిస్తుందని అంతా భావించారు. కానీ క్వార్టర్ ఫైనల్లో ఆమెకు ఊహించని షాక్ తగింది. బెలారస్కు చెందిన వెనెసా చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఉత్తిచేతులతోనే వినేశ్ భారత్ చేరుకుంది.
అనుచిత ప్రవర్తన కారణంగా వినేశ్ ఫొగాట్పై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ఒలింపిక్స్ జరిగేటప్పుడు క్రీడా గ్రామంలో అథ్లెట్లకు కేటాయించిన గదుల వద్ద తోటి రెజ్లర్లతో కలిసి ఆమె ఉండటానికి నిరాకరించిందని, అలాగే వారితో ప్రాక్టీస్ చేయలేదని, మరోవైపు ఒలింపిక్స్లోనూ భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్ కిట్ను ధరించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత్కు చేరిన వినేశ్కు డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16 లోపు వివరణ ఇచ్చేందుకు ఆమెకు గడువు ఇచ్చారు. వినేశ్ సమాధానం నమ్మశక్యంగా లేకపోతే డబ్ల్యూఎఫ్ఐ దీర్ఘకాలం నిషేధం విధించే అవకాశం. ఈ నేపథ్యాలన్నీ ఆమెను మానసికంగా కుంగిపోయేలా చేశాయి.