టోక్యో: కరోనా నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్లో కఠిన ఆంక్షలు అమలుకానున్నాయి. అథ్లెట్ల పట్ల నిర్వాహకులు కొంచెం కఠినంగా వ్యవహరించనున్నారు. ఈవెంట్లు పూర్తయిన తర్వాత క్రీడాకారులు వీలైనంత వేగంగా జపాన్ను వీడి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందులో భాగంగానే క్రీడాగ్రామంలో రాత్రిపూట పార్టీలను నిషేధించారు. ఇక, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాన్ని తప్పనిసరిగా వేయడం, ర్యాపిడ్ టెస్ట్లు చేసేలా నిబంధనలను విధించనున్నారు.
'ఎక్కువ కాలం క్రీడా గ్రామంలో ఉండడం వల్ల ఇబ్బందులు మరింతగా పెరుగుతాయి' అని టోక్యో క్రీడలను పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు జాన్ కోట్స్ చెప్పాడు. పర్యాటకులను పూర్తిగా నిరుత్సాహపరుస్తారా? అని అడిగిన ప్రశ్నకు 'ఔను' అని కోట్స్ సమాధానమిచ్చాడు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. అథ్లెట్లంతా దాన్ని తీసుకునేలా ప్రోత్సహిస్తామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ చెప్పాడు. కరోనా మహమ్మారి కారణంగా ఈఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ను 2021కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి నిర్వాహకులు సన్నాహకాలను ముమ్మరం చేయనున్నారు.