హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ తర్వాత భారత్ ఖాతాలో మళ్లీ పతకం చేరలేదు. అయితే ఈ నీరీక్షణకు తెరదించుతూ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ శుక్రవారం మరో మెడల్ను ఖాయం చేసింది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ (69 కేజీల విభాగం)లో లవ్లీనా 4-1 తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ నీన్-చిన్ చెన్ (చైనీస్ తైపీ)ని చిత్తు చేసి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్లోనూ గెలిస్తే ఆమె స్వర్ణం లేదా రజతం కోసం పోటీ పడుతుంది. ఒకవేళ ఓడినా... కనీసం కాంస్య పతకం దక్కుతుంది. 2012లో మేరీకోమ్, విజేందర్ సింగ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారత మూడో బాక్సర్గా లవ్లీనా నిలిచింది.
అయితే ఒలింపిక్స్లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోరు జరుగుతుంది. సెమీస్లో ఓడిన ఇద్దరు బ్రాంజ్ మెడల్ కోసం ఆడాల్సి ఉంటుంది. అయితే బాక్సింగ్కు వచ్చేసరికి పరిస్థితి భిన్నం. సెమీఫైనల్ చేరిన ఇద్దరికీ మరో మ్యాచ్ లేకుండానే పతకం ఖాయమవుతుంది. సాధారణంగా సెమీస్లో ఓడిన బాక్సర్పై ప్రత్యర్థి పంచ్ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 'నాకౌట్' ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత స్పృహ కోల్పోయే (కన్కషన్) అవకాశం కూడా ఉండవచ్చు.
వారు సాధారణ స్థితికి వచ్చి తక్కువ సమయంలో మళ్లీ బరిలోకి దిగడం చాలా కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48-72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే బ్రాంజ్ మెడల్ కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయినా ఆడితే ఇద్దరికీ ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మూడో స్థానం మ్యాచ్ను రద్దు చేసి ఇద్దరికీ పతకాలు ఇస్తున్నారు. సెమీస్లో ఓడిన ప్రతీ బాక్సర్ సమస్య ఎదుర్కోవాలని లేదు కానీ ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు రాకుండా ముందు జాగ్రత్త అని
చెప్పవచ్చు.
1952 ఒలింపిక్స్ గేమ్స్లో తొలిసారి బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ ఫైట్ నిర్వహించలేదు. అయితే ఆ ఒలింపిక్స్లో బాక్సింగ్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్స్ ఇవ్వలేదు. ఫైనలిస్టులిద్దరికీ గోల్డ్, సిల్వర్ ఇచ్చి సెమీఫైనలిస్ట్లకు ఒలింపిక్ డిప్లమా ఇచ్చారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ నుంచి బ్రాంజ్ మెడల్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే 1948 లండన్ ఒలింపిక్స్లో బాక్సింగ్ పోటీలు ఆలస్యమవ్వడం.. ఓ బాక్సర్ తీవ్రంగా గాయపడి కాంస్యపోరుకు సిద్దంగా లేకపోవడంతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ బ్రాంజ్ మెడల్ ఫైట్ రద్దు చేయాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీ కోరింది. దాంతో 1952 ఒలింపిక్స్లో కాంస్యపోరు రద్దు చేసిన ఐఓసీ.. 1956 నుంచి సెమీస్లో ఓడిన ఇద్దరికీ మెడల్స్ ఇస్తోంది. ఇక ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో లవ్లీనా ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలీ (టర్కీ)తో తలపడుతుంది.