
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ఒలింపిక్స్లో దేశానికి రజత పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్..మీరాబాయి చాను. టోక్యో ఒలింపిక్స్లో తన ప్రస్థానాన్ని విజయవంతంగా చేసుకున్న ఆమె తిరగు ప్రయాణం కట్టారు. కోచ్తో కలిసి టోక్యోలో భారత విమానం ఎక్కారు. ఈ సాయంత్రానికి ఆమె ఢిల్లీకి చేరుకోనున్నారు. పతకంతో తిరిగి వస్తానంటూ దేశ ప్రజలకు ప్రామిస్ చేసిన మీరాబాయి చాను.. తన మాటను నిలబెట్టుకున్నారు. చెప్పినట్టే- పతకంతో స్వదేశానికి రానున్నారు.
కాగా- మీరాబాయి చానుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందాయి. 2000 తరువాత భారత్కు ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని అందజేయడం పట్ల రాష్ట్రపతి స్థాయి నుంచి ఓ సగటు అభిమాని వరకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నజరానాల వర్షాన్ని కురిపించారు. ఈ లిస్ట్లో మిస్ అయిన విరాట్ కోహ్లీ.. తాజాగా మీరాబాయి చానుకు గ్రీటింగ్స్ తెలిపాడు. లేట్ అయినా లేటెస్ట్గా శుభాకాంక్షలు చెప్పాడు. మీరాబాయి చానుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ చిన్న వీడియో క్లిప్ను విడుదల చేశాడు విరాట్ కోహ్లీ.
22 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మీరాబాయి వెయిట్ లిఫ్టింగ్లో పాల్గొన్న రెండు ఫొటోలను జత చేశారు. దేశభక్తిని రగిల్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ను కంపోజ్ చేశారు. దేశ పౌరుల ఆశలను తన భుజాల మీద మోశారని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఒలింపిక్స్లో పతకాన్ని ముద్దాడాలనే ఆశయాలను ఆమె నిజం చేసి చూపించారని చెప్పాడు. కోట్లాదిమంది ప్రజల భారాన్ని మోశారని అన్నాడు. ఒలింపిక్స్లో ప్రతి ఒక్క అథ్లెట్ గేమ్ను తప్పనసరిగా వీక్షించాలని విజ్ఞప్తి చేశాడు.
టోక్యో ఒలింపిక్స్ రెండో రోజే మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 49 కేజీలో ఈ విభాగంలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా 202 కిలోల బరువును ఎత్తారు. ఈ కేటగిరీలో చైనా బంగారు పతకాన్ని అందుకుంది. భారత్ రెండో స్థానంలో నిలిచింది. మణిపూర్లోని ఆమె స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తన కలను సాకారం చేసుకున్న మీరాబాయి భారత్కు తిరుగు ప్రయాణం అయ్యారు.