
హైదరాబాద్: భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ తన కెరీర్లో 18వ ప్రపంచ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో 8-2తో అమీర్ సర్కోష్ (ఇరాన్)ను ఓడించి పంకజ్ అద్వానీ విజేతగా అవతరించాడు.
వివరాల్లోకి వెళితే
సోమవారం జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్ ఫైనల్లో ఇరాన్కు చెందిన అమీర్ సర్కోష్పై 8-2 (19-71, 79-53, 98-23, 69-62, 60-5, 0-134, 75-7, 103-4, 77-13, 67-47) ఫ్రేమ్ల తేడాతో పంకజ్ అద్వానీ విజయం సాధించాడు.
ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడిన పంకజ్ ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. ఈ నెలలో అడ్వానీకి ఇది మూడో ప్రపంచ ఛాంపియన్షిప్. అంతకముందు ఇదే వేదికలో జరిగిన బిలియర్డ్స్ లాంగ్, షార్ట్ ఫార్మాట్లలో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించాడు.
ఆదివారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 7-4 ఫ్రేమ్ల తేడాతో 15 ఏళ్ల ఫ్లోరియన్ నుబిల్ (ఆస్ట్రియా)పై; క్వార్టర్ ఫైనల్లో 6-2 ఫ్రేమ్ల తేడాతో లువో హాంగ్హావో (చైనా)పై గెలిచాడు. బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్ - 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్ను గెలిచాడు.
అంతేకాదు ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్ - 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్ను మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్ను, రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్ను, ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్ను సాధించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.