మరో ఇద్దరు అథ్లెట్లు ఉన్నప్పటికీ పీవీ సింధుకే మొగ్గు
ఇకపోతే ఫ్లాగ్ బేరర్ రేసులో మరో ఇద్దరు అథ్లెట్లు కూడా ఉన్నప్పటికీ సింధుకే అవకాశం దక్కింది. వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్లు సైతం ఒలింపిక్స్లో భారత్కు పతకాలు అందించారు. అయితే రెండుసార్లు ఒలింపిక్ మెడల్ సాధించడంతో పీవీ సింధు వారి కంటే కొంచెం అధిక ప్రాధాన్యం కలిగి ఉంది. పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ - 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సింగపూర్ ఓపెన్లో విజేతగా నిలిచింది. ఆమె ఈ ఏడాది ప్రారంభంలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్లను కూడా గెలుచుకుంది. సింధు కామన్ వెల్త్ గేమ్స్లో ఆగస్టు 3న బ్యాడ్మింటన్ సింగిల్స్లో తలపడనుంది. ప్రారంభ వేడుక గురువారం (జూలై 28) బర్మింగ్హామ్లోని అలెగ్జాండర్ స్టేడియంలో జరుగుతుంది.
నా టైటిల్ కాపాడుకోలేకపోవడం బాధగా ఉంది
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా గురువారం బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో ఫ్లాగ్ బేరర్గా దేశానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయినందుకు తీవ్రంగా నిరాశ చెందాడు. ఇటీవల వరల్డ్ అథ్లెటిక్స్లో అతను గాయపడి కామన్ వెల్త్ గేమ్స్కు దూరమైన సంగతి తెలిసిందే. అతను స్పందిస్తూ..'నా టైటిల్ కాపాడుకోలేకపోవడం, అలాగే దేశానికి ప్రాతినిధ్యం వహించే మరో అవకాశాన్ని కోల్పోవడం పట్ల నేను చింతిస్తున్నాను. ఓపెనింగ్ సెర్మనీలో ఫ్లాగ్ బేరర్ అవకాశాన్ని కోల్పోవడం పట్ల నిరాశచెందుతున్నాను. త్వరలోనే నేను అలాంటి అవకాశాన్ని అందుకుంటానని ఆశిస్తున్నాను.' అని నీరజ్ పేర్కొన్నాడు.
మన టీంకు చీర్స్ చెపుదాం
నీరజ్ చోప్రా తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ మేరకు పోస్టు చేస్తూ.. 'ప్రస్తుతానికి, నేను నా పునరాగమనంపై దృష్టి సారిస్తున్నాను. అతి త్వరలో తిరిగి బళ్లెం పడతానని ఆశిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నేను అందుకున్న ప్రేమ, మద్దతుకు నేను యావత్ దేశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే వారాల్లో బర్మింగ్హామ్లోని నా తోటి టీమిండియా అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు నాతో పాటు మీరందరూ చేరాలని కోరుతున్నాను. జై హింద్' అని నీరజ్ పేర్కొన్నాడు.