|
9.55 సెకన్లలోనే 100 మీటర్లు:
దక్షిణ కన్నడకు చెందిన సాంప్రదాయ కంబాల పోటీదారు 28 ఏళ్ల శ్రీనివాస గౌడ ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తాడు. తాజాగా జరిగిన గేదె (ఎద్దు)ల పోటీలో శ్రీనివాస గౌడ ఏకంగా 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలోనే పూర్తి చేశాడు. అంటే.. గౌడ 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే అందుకున్నాడు. అది కూడా గేదెలతో బురద నీటిలో పరుగెత్తడం విశేషం. 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరుగెత్తడం అంటే.. ప్రపంచ ఛాంపియన్ బోల్ట్ అత్యుత్తమ ప్రదర్శన కంటే గొప్పది.
సాంప్రదాయ క్రీడ:
కంబాల అనేది దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాల ఆటలో ఎద్దుల పోటీదారుడు (బఫెలో జాకీ) రెండు గేదెలతో బురద నీటిలో పరుగెడతాడు. ఎవరైతే గేదెలను వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతగా నిలుస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రీడా ఎప్పటినుంచో ఉంది.
30 ఏళ్ల రికార్డు బద్దలు:
శ్రీనివాస గౌడ ఇప్పటివరకు 12 కంబాల పోటీల్లో 29 బహుమతులు గెలుచున్నాడు. తాజాగా బెల్తాంగడి సమీపంలోని అలడంగడిలో జరిగిన పోటీలో గౌడ విజేతగా నిలిచాడు. అక్కడే గౌడ కంబాల క్రీడ చరిత్రలో 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. పరుగెత్తే క్రమంలోనే బోల్ట్ రికార్డును కూడా అధిగమించాడు. ప్రస్తుతం గౌడ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరో బోల్ట్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. గౌడ ముందు బోల్ట్ కూడా తేలిపోయాడు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఎద్దుల జోడీలకు జాకీగా:
'భారత చిరుత' శ్రీనివాస గౌడ 5వ తరగతి వరకే చదివాడు. కొన్ని కారణాల వల్ల చదువు ఆపేసి పనులు చేసేవాడు. ప్రస్తుతం గౌడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే గత ఐదారు సంవత్సరాలుగా కంబాల పోటీల్లో పాల్గొంటున్నాడు. ఓ ఇద్దరి యజమానుల వద్ద పనిచేస్తూ.. వారికి సంబంధించిన మూడు ఎద్దుల జోడీలకు శ్రీనివాస గౌడ జాకీగా వ్యవహరిస్తున్నాడు.