ఆసియా క్రీడల కోసం ఎన్నో త్యాగాలను
తేజిందర్ తండ్రి కరమ్ సింగ్ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. అయినప్పటికీ తనయున్ని ఆసియా క్రీడలకు పంపడం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేశారు. ప్రతి విజయంలో తోడుగా ఉన్న తండ్రికి తాను సాధించిన బంగారు పతకాన్ని చూపిద్దామని ఎన్నో ఆశలతో జకార్తా నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో దిగి దిగగానే తండ్రి పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలిసింది.
బంగారు పతకం సాధించాలనే చివరి కోరిక
తేజిందర్ పంజాబ్లోని మోగాకు ఢిల్లీ నుంచి రోడ్డు మార్గం ద్వారా పయనమయ్యాడు. కానీ, ఇంకా ఇంటికి కొద్ది దూరంలో ఉండగానే తండ్రి చనిపోయిన విషయం తెలిసింది. ‘తాను బంగారు పతకం సాధించలన్నది నా తండ్రి చివరి కోరిక. కానీ ఇప్పుడు పతకాన్ని తండ్రికి చూపించి ఆ కోరిక తీర్చాలనుకుంటే దేవుడు ఆ కోరిక తీరకుండా చేశాడు' అని తేజిందర్ కన్నీరుమున్నీరవుతున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో తేజిందర్ మిగుల్చుకున్న నిరాశ:
తుర్కెమెనిస్థాన్లో జరిగిన ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లో ద్వితీయ స్థానంలో నిలిచి ఆకట్టుకున్నాడు. కానీ 2018 కామన్వెల్త్ క్రీడల్లో తేజిందర్ బాగా నిరాశ పరిచాడు. చెత్త ప్రదర్శనతో ఎనిమిదో స్థానంలో నిలవడం అతనిలో కసి పెంచింది. జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి ఫామ్లోకి వచ్చిన ఈ కుర్రాడు.... ఆ తర్వాత ఆసియా నంబర్వన్ షాట్పుటర్గా నిలిచాడు.
21 మీటర్ల దూరం విసరడం ఒక్కటే లక్ష్యంగా
'గుండును 21 మీటర్ల దూరం విసరడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నా. కొన్నేళ్లుగా జాతీయ రికార్డు బద్దలు కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించా. మా నాన్న చేసిన ఎన్నో త్యాగాల ఫలితం ఈ ఆసియా క్రీడల స్వర్ణం. నా లక్ష్యం కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. కోచ్ థిల్లాన్ కృషి ఎంతో ఉంది. ఇప్పుడు వెంటనే వెళ్లి నాన్నను చూడాలని ఉంది' అంటూ పతకం గెలిచిన అనంతరం తేజిందర్ చెప్పాడు.