ఢిల్లీ: 2010-19 మధ్య కాలంలో పరిష్కరించని 14 లైంగిక వేధింపుల కేసులలో తొమ్మిదింటిపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సోమవారం చర్యలు తీసుకుంది. మిగిలిన ఐదు కేసులను కూడా రాబోయే రెండు వారాల్లో పరిష్కరిస్తాం అని సాయ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 24 అసోసియేషన్ల సమహారంగా ఉన్న శాయ్లో 45 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించిన దాదాపు రెండు నెలల తరువాత కేసులు పరిష్కరించబడుతున్నాయి.
'దక్షిణాఫ్రికా సిరీస్లో కోహ్లీ తానేంటో చూపిస్తాడు'
సోమవారం శాయ్ అధికారులు మాట్లాడుతూ... 'అథ్లెట్లు దాఖలు చేసిన 14 లైంగిక వేధింపుల కేసుల్లో 9 కేసులపై శాయ్ విచారణ జరిపింది. మూసివేయబడిన తొమ్మిది కేసులు పరిష్కరించాం. కోచ్లపై కఠిన చర్యలు తీసుకున్నాం. ముగ్గురు కోచ్లను బహిష్కరించాం. మరోకరు డిప్యుటేషన్లో ఉన్న కారణంగా విచారణ జరుపుతున్నాం. మరో ఐదు కేసులు పరిష్కరించే దశలో ఉన్నాయి. రాబోయే రెండు వారాల్లో వాటిని పూర్తి చేస్తాం' అని అన్నారు.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద జనవరి 17న ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెల్లడించిన విషయాలు విస్మయానికి గురిచేసాయి. గత దశాబ్ద కాలంలో శాయ్లో మొత్తం 45 లైంగిక వేధింపుల కేసులు నమోదవ్వగా.. అందులో 29 కేసులు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ వంటి క్రీడలకు సంబంధించిన కోచ్లపై నమోదయ్యాయి. అథ్లెట్లు తమ కోచ్లపై పెట్టిన కేసులు నెల రోజుల్లో పరిష్కరించబడుతాయి అని కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
తాను బాధ్యతలు స్వీకరించే సమాయానికి పెండింగ్లో ఉన్న లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్యను చూసి షాక్ అయ్యానని, దీనికి మన కల్చరే కారణమని 2018-19లో శాయ్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించిన నీలమ్ కపూర్ గతంలో తెలిపారు. ఇంతకుమున్దు శిక్ష విధించినా.. ట్రాన్స్ఫర్లు, జీతం, పెన్షన్లో కోతతో సరిపెట్టింది. అయితే ఈసారి మాత్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.