టోక్యో: జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న ఒలింపిక్స్లో పదో రోజు భారత్.. కీలక మ్యాచ్లను ఆడుతోంది. ఊహించని విధంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్లో ఓడిపోయారు. బంగారు పతకాన్ని ముద్దాడే బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయారు. మూడోస్థానం కోసం ఆమె పోరాడాల్సి ఉంది. దీన్ని నిలబెట్టుకుంటే.. భారత్కు కాంస్య పతకం ఖాయమౌతుంది. కాంస్య పతకానికి పీవీ సింధు.. ఒక్క మ్యాచ్ దూరంలో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఓడిపోతే..మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత ప్రస్థానం ముగిసినట్టే. ఒట్టి చేతులతో తిరిగి రావాల్సి ఉంటుంది.
మరోవంక- స్టార్ బాక్సర్ సతీష్ కుమార్.. ఇంకాస్సేపట్లో పంజా విసరబోతోన్నాడు. ఇప్పటికే 91 కేజీల సూపర్ హెవీవెయిట్ బాక్సింగ్ ఈవెంట్లో అతను ముందంజ వేశాడు. క్వార్టర్ ఫైనల్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సెమీ ఫైనల్స్లో స్థానం సంపాదించడానికి ఉజ్బెకిస్తాన్కు చెందిన బొఖొదిర్ జొలొలొవ్ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ బౌట్.. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:36 నిమిషాలకు ప్రారంభమౌతుంది. ఇందులో సతీష్ కుమార్ విజయం సాధించగలిగితే బాక్సింగ్లో మరో పతకం ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాంస్య పతకం కోసం పీవీ సింధు తలపడబోయే మ్యాచ్ ఈ సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్ గనక ఆమె నెగ్గితే.. వరుస ఒలింపిక్స్లల్లో పతకాలను సాధించిన తొలి మహిళగా ఆవిర్భవిస్తారు. 2016లో బ్రెజిల్ రాజధాని రియో డీ జనేరియోలో జరిగిన ఒలింపిక్స్లో ఆమె రజతాన్ని గెలచుకున్నారు. ఇప్పటిదాకా ఈ ఘనతను సాధించిన భారత్ అథ్లెట్ సుశీల్ కుమార్ ఒక్కడే. వరుస ఒలింపిక్స్లో అతను రజతం, కాంస్య పతకాలను సాధించాడు.
ఈ సాయంత్రం జరిగే మ్యాచ్లో పీవీ సింధు చైనా ప్రత్యర్థి హె బింగ్జియావోను ఢీ కొనబోతోన్నారు. ఆమెపై పీవీ సింధు విన్నింగ్ ట్రాక్ రికార్డ్ బాగోకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటిదాకా 15 సార్లు ఈ ఇద్దరు పోటీ పడ్డారు. ఇందులో సింధు ఆరుసార్లు మాత్రమే బింగ్ జియావోపై విజయం సాధించారు. బింగ్ జియావోతో చివరిసారిగా ఆడిన మ్యాచ్లోనూ ఓడిపోయారు పీవీ సింధు. 21-19, 21-19 వరుస సెట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ సారి ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తారా? లేదా? అనేది ఈ సాయంత్రం తేలిపోనుంది. ఈ చైనా అడ్డుగోడను పీవీ సింధు అధిగమించడంపైనే పతకం ఆశలు నెలకొని ఉన్నాయి.