
న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్ 2020లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖారాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరడమే కాకుండా.. పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా 19 ఏళ్ల అవని రికార్డు సృష్టించింది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె సోమవారం బంగారు పతకం సాధించింది. ఫైనల్లో అవనీ లేఖరా 249.6 రికార్డు స్కోరుతో బంగారు పతకం దక్కించుకోగా.. చైనాకు చెందిన కుయ్పింగ్ ఝాంగ్ 248.9 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకుంది. ఉక్రెయిన్కి చెందిన ఇరినా షెత్నిక్ 227.5 స్కోరుతో కాంస్య పతకం దక్కించుకుంది.
టోక్యో పారాలింపిక్స్ 2020లో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల అవని లేఖారాను ట్విట్టర్ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. 'అద్భుతమైన ప్రదర్శన. ఎంతో కష్టపడి గోల్డ్ మెడల్ సాధించినందుకు శుభాకాంక్షలు. ఇది షూటింగ్ పట్ల నీకు ఉన్న అంకితభావం వల్లే సాధ్యమైంది. ఇండియన్ స్పోర్ట్స్కు ఇదో ప్రత్యేక సందర్భం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
టోక్యో పారా ఒలింపిక్స్ 2002లో స్వర్ణ పతకాన్ని సాధించిన అవనీ లేఖరాకు, పురుషుల డిస్కస్ త్రోలో రజత పతకాన్ని సాధించిన యోగేష్ కథూనియాలకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. వారి విజయాలను చూసి దేశం గర్విస్తోందన్నారు. వారి భవిష్యత్ ఉజ్వలంగా సాగాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్య ట్విట్టర్లో పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, పారాలింపియన్ దీపా మాలిక్ కూడా అవనిపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అవనిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
జైపురకి చెందిన 19 ఏళ్ల రైఫిల్ షూటర్ అవని లేఖారాకి 2012లో పదేళ్లు. ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోయింది. నడుము కింద భాగం చచ్చుబడడంతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లకు హాజరయినా ఫలితంలేదు. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు దొరికింది. అక్కడినుంచి చదువు విషయంలో వెనకంజవేయలేదు. అయితే తన మనసు మళ్లేందుకు ఏదైనా రంగంలో పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. అవని వాళ్ల నాన్న ఓసారి ఆర్చరీ, షూటింగ్ రేంజ్లకు తీసుకెళ్లడంతో.. వాటిపై మక్కువ పెంచుకుంది. సీరియస్గా సాధన చేసి.. దేశానికి బంగారు పతకం అందించింది.
గత కొన్నేళ్లుగా అవని సాధించిన విజయాలు ఆమె పట్టుదలకు నిదర్శనం. శిక్షణ తీసుకున్న మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో మూడు పతకాలు అందుకుంది. అప్పటికి ఆమెకో సొంత రైఫిల్ కూడా లేదు. కోచ్ దగ్గర అరువు తెచ్చుకుంది. 2017లో ఆన్ఐన్ఓలో జరిగిన పారా షూటింగ్ వరల్డ్కప్లో రజతాన్ని అందుకుంది. కరోనా కారణంగా గతేడాదిగా ఫిజియోథెరపీ సెషన్లు ప్రభావితమైనా, సరైన శిక్షణా, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా ఇంటి దగ్గరే సాధన చేసింది. చివరకు పారాలింపిక్స్ 2020లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.