హర్యానాకు చెందిన దీపా మాలిక్
హర్యానాకు చెందిన దీపా మాలిక్ తండ్రి ఓ ఆర్మీ అధికారి. ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు దీపాకు వెన్నుముకపై చిన్నపాటి కణితి వచ్చింది. దీంతో ఆమెకు మూడేళ్ల పాటు వివిధ ఆసుపత్రుల్లో రకరకాల చికిత్సలు చేయించారు. ఎంతో కఠినమైన ఫిజియోథెరపీలు చేయించుకుంటున్నా ముఖంపై చిరునవ్వును చెరగనిచ్చేది కాదు.
చిన్నప్పటి ఆటలంటే పిచ్చి
ఆమెకు చిన్నప్పటి నుంచీ ఆటలన్నా, బైక్ రైడింగ్ అన్నా చెప్పలేనంత పిచ్చి. అలా దీపా మాలిక్కు ఇరవై సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఓ ఆర్మీ అధికారికిచ్చి పెళ్లి చేశారు. అతను దీపా మాలిక్ పరిస్థితిని అర్థం చేసుకుని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
కణితి తొలగించుకోవాలన్నారు
వారితో ఆమె జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఇంతలోనే ఆమె వెన్నుముకపై ఉన్న కణితి సమస్య పెరిగిపోయింది. ఆసుపత్రికి వెళితే "కణితి తొలగించుకోవాలి లేకపోతే కేన్సర్ బారినపడే మరణించే అవకాశం ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేయించుకుని కణితి తొలగించుకుంటే పక్షవాతం బారినపడి జీవితాంతం వీల్ఛైర్కే పరిమితం అయ్యే అవకాశం ఉంది" డాక్టర్లు చెప్పారు.
మూడు ఆపరేషన్లు చేసిన వైద్యులు
దీంతో ఆమె ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. కణితిని తొలగించుకోవడానికి వైద్యులు మొత్తం మూడు ఆపరేషన్లు చేశారు. అప్పటి నుంచి ఆమె శరీరంలోని కింది భాగం మొత్తం పక్షవాతానికి గురైంది. అప్పటివరకూ భర్త, పిల్లలతో ఆనందంగా గడిపిన ఆమె ఒక్కసారిగా తన నిర్ణయంతో అచేతనంగా మారిపోయింది. అయినా ఏమాత్రం బెదరలేదు.
ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు సొంతం
ఆరేళ్ల పాటు ఫిజియోథెరపీ చేయించుకుంది. ఆ సమయంలో ఆమెలో పట్టుదల పెరిగి ఆటలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పారాలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా కూడా దీపామాలిక్ చరిత్ర సృష్టిస్తుంది. దీపామాలిక్ ఇప్పటి వరకు 23 అంతర్జాతీయ పతకాలు, 68 రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించింది. ఇప్పటికే ఆమె అర్జున, పద్మశ్రీలను సొంతం చేసుకుంది. తాజాగా దేశ అత్యున్నత పురస్కారం ఖేల్ రత్నను సొంతం చేసుకుంది.