మహిళా అథ్లెట్లు ఎప్పటిలా చీరలు ధరించడంలేదు
దీనిపై భారత ఒలింపిక్ సమాఖ్య జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా మాట్లాడుతూ 'ఈ ఏడాది ఏప్రిల్ 4న ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభంకానున్నాయి. ఈ మెగా టోర్నీ ప్రారంభ వేడుకల్లో భారత బృందంలోని మహిళా అథ్లెట్లు ఎప్పటిలా చీరలు ధరించడంలేదు. వాటికి బదులుగా కోట్లు, ప్యాంట్లు ధరించనున్నారు' అని అన్నారు.
అథ్లెట్లను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నాం
'అథ్లెట్లను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రారంభ వేడుకలు సుమారు నాలుగు నుంచి ఐదు గంటల వరకు జరుగుతాయి. దీంతో మహిళా అథ్లెట్లు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది అమ్మాయిలకు చీర కట్టుకోవడం రాదు. తోటి వారి సాయం తీసుకుంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పురుషులు, మహిళలు ఒకే విధమైన డ్రస్సు ధరించేలా నిర్ణయం తీసుకున్నాం' అని అన్నారు.
సంతోషం వ్యక్తం చేసిన మహిళా అథ్లెట్లు
భారత ఒలంపిక్ సమాఖ్య నిర్ణయంపై పలువురు మహిళా అథ్లెట్లు సంతోషం వ్యక్తం చేశారు. ‘కోట్లు, ప్యాంట్లు ధరించడం వల్ల మాకు చాలా సమయం ఆదా అవుతుంది. అంతేకాదు చాలా హాయిగా ఫీలవుతాం. కోట్లు-ప్యాంట్లు బదులు కోట్లు-స్కర్టులు ఉంచితే ఇంకా సంతోషించే వాళ్లం' అని షూటర్ హీనా సిద్దు తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
చీరపై కోటు ఎప్పటినుంచో ఆనవాయితీ
కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ టోర్నీల్లో మహిళా అథ్లెట్లు ఇప్పటివరకు చీర ధరించి దానిపై కోటు వేసుకోవడం ఎప్పటినుంచో ఆనవాయితీ వస్తోంది. క్రీడాకారులు ధరించే కోటుపై భారత ఒలింపిక్ సమాఖ్య లోగో ఉంటుంది. ఈ ఇండో-వెస్ట్రన్ కాంబినేషన్ కొంతమంది మహిళా అథ్లెట్లను ఇబ్బంది పెడుతోంది.
కోటు లేకుండా చీరతోనే ప్రారంభోత్సవ వేడుకలకు
దీంతో గతంలో పలువురు మహిళా అథ్లెట్లు కోటు లేకుండానే చీరతోనే ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జ్వాలా గుత్తా కోటు లేకుండానే ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంది. ఇక, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్లో సానియా మిర్జా కూడా ఇలానే చేసింది.
చీరను ధరించడం కాస్తంత ఇబ్బంది
కొంతమంది మహిళా అథ్లెట్లు ప్రారంభోత్సవ వేడుకల్లో చీరను ధరించడం కాస్తంత ఇబ్బందిగా ఫీలయ్యారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో టెన్నిస్ ప్లేయర్ సునితా రావు ట్రాక్స్ ధరించి వేడుకల్లో పాల్గొంది. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే కామన్వెల్త్ గేమ్స్లో భారత్ నుంచి మొత్తం 225 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.