జపాన్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ రద్దు చేయాలని జపాన్ నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి భయంతో మూడోవంతు మంది ప్రజలు ఒలింపిక్స్ రద్దు చేయాలని కోరుకుంటున్నారు. విదేశీ రాకపోకలు ద్వారా కరోనా కేసులు ఎక్కువవుతాయని అక్కడి ప్రజలు అంటున్నారు. మహమ్మారి ప్రభావంతో ఈ ఏడాది ఒలింపిక్స్.. వచ్చే సంవత్సారానికి వాయిదా పడ్డాయి. జూలై 23 నుంచి ఆగస్టు 8వరకు టోక్యో గేమ్స్ జరగనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ వార్తలతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ).. వచ్చే ఏడాది జూన్ మాసంలో ఎలాగైనా నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది జూన్ కల్లా వ్యాక్సిన్ వస్తోందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దీంతో ఒలింపిక్స్ నిర్వహణకు ఎలాంటి అడ్డుంకులు రావని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ జపాన్ ప్రజలు మాత్రం ఒలింపిక్స్ నిర్వహణపై అసంతృప్తిలో ఉన్నారు.
జపాన్లో జరిపిన ఓ సర్వే ప్రకారం (NHK poll) కేవలం 27 శాతం ప్రజలు మాత్రమే ఒలింపిక్స్ నిర్వహణకు మద్దతు తెలిపారు. 32 శాతం ప్రజలు ఒలింపిక్స్ రద్దుకే మొగ్గుచూపుతున్నారు. ఇక మిగతా 31 శాతం ప్రజలు మరో ఏడాది వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. దాదాపు జపాన్లో 63 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు కారణం కరోనా సృష్టించిన భయం వారి మనస్సుల్లో ఇంకా ఉండడమే. ఒలింపిక్స్ నిర్వహిస్తే మరోసారి పెనుముప్పు వచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కరోనా కారణంగా ఒలింపిక్స్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం వల్ల భారీగా అదనపు భారం పడింది. వచ్చే ఏడాదికి వాయిదా వేయడం వల్ల 2.8 బిలియన్ డాలర్ల (రూ. 20 వేల కోట్లు) వరకూ అదనపు భారం పడుతోందని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది జులై-ఆగస్టులో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్.. కొత్త షెడ్యూల్ ప్రకారం 2021 జులై 23న మొదలవనుంది. భారంలో 2/3 వంతుల ఖర్చును టోక్యో, జపాన్ ప్రభుత్వాలు భరిస్తాయి. ప్రైవేట్ నిధులతో నడిచే ఆర్గనైజింగ్ కమిటీ 1/3వ వంతు భరించనుంది. ఎటువంటి పరిస్థితులలోనూ గేమ్స్ రద్దుచేయమని, ఒలింపిక్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని టోక్యో గవర్నర్ యురికో కొయిక్ స్పష్టం చేశారు.
Year Ender 2020: కంగారూల గడ్డపై భారత ప్రదర్శనలు.. మరచిపోలేని ఐదు జ్ఞాపకాలు ఇవే!!