న్యూఢిల్లీ: ఒకనాటి శత్రువులకున్న వారు.. తాము ఎప్పటికీ మిత్రులమేనని నిరూపించారు. వారే టీమిండియా మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధూ, మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. వివరాల్లోకి వెళితే.. నరాల్లో రక్తం గడ్డకట్టడం అనే ప్రాణాంతక వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో సిద్ధూ చేరిన విషయం తెలిసిందే.
కాగా, గురువారం సిద్ధూను మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పరామర్శించాడు. నిజానికి సిద్ధూ ఆరోగ్యం దృష్ట్యా అతణ్ని కలిసేందుకు వైద్యులు ఎవర్నీ లోపలికి అనుమతించలేదు. అయితే అజారుద్దీన్ మాత్రం 'లోపల నా సోదరుడున్నాడు' అంటూ ఆస్పత్రి సిబ్బందిని తోసుకుంటూ మరీ సిద్ధూ గదిలోకి ప్రవేశించాడు.
కాగా, అజారుద్దీన్ తనను పరామర్శించిన ఫొటోను సిద్ధూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 'ఓల్డ్ గోల్డ్ ఓల్డ్ వైన్ ఓల్డ్ ఫ్రెండ్స్' అంటూ సిద్ధూ ఆ ఫొటోకు వ్యాఖ్యానం రాశాడు. కాగా, ఇప్పటి ఈ ఆత్మీయ సోదురులు కలిసి ఆడేరోజుల్లో మాత్రం ఒకదశలో బద్దశత్రువులుగా వ్యవహరించారు.
Old Gold, old wine, old friends - still the Best! pic.twitter.com/cz83GWAUJh
— Navjot Singh Sidhu (@sherryontopp) October 8, 2015
అజార్తో అభిప్రాయ బేధాల కారణంగానే సిద్ధూ 1996 ఇంగ్లాండ్ పర్యటన నుంచి అర్ధంతరంగా వచ్చేశాడు. అప్పటి ఈ తెర వెనుక సంగతుల్ని టీమ్ మేనేజ్మెంట్ గానీ బీసీసీఐ వెల్లడించలేదు. అయితే, బీసీసీఐ మాజీ కార్యదర్శి జైవంత్ లెలె 2011లో తాను రాసిన ఓ పుస్తకంలో ఆ పర్యటన నుంచి సిద్ధూ అర్ధంతర నిష్క్రమణ వెనుక కారణాల్ని వివరించారు.
ఆ పర్యటనలో మూడో వన్డేలో తనకు తుది జట్టులో స్థానం దక్కలేదన్న సంగతిని కెప్టెన్గా అజార్ తెలపకపోవడం.. ఆ సంగతిని డ్రెస్సింగ్ రూమ్కు అతికించిన జాబితా ద్వారా తెలుసుకోవడం సిద్ధూ మనసును గాయపరిచిందని లెలె తన పుస్తకంలో రాశారు. అంతేగాక, కెప్టెన్గా అజార్ తనను అదే పనిగా దుర్భాషలాడడంతోనే సిద్ధూ స్వదేశానికి తిరిగొచ్చాడని అందులో పేర్కొన్నారు.